Wednesday, December 15, 2010

ప్రభుత్వాన్ని కూల్చం... కానీ కుళ్లబొడుస్తాం... జగన్ విధేయులు!!!

రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకీ హీనాతిహీనంగా దిగజారిపోతోంది. విపక్షాలకంటే స్వపక్ష సభ్యులే ఆ పార్టీని మాటలతో కుళ్ళబొడుస్తున్నారు. దివంగత నేత వైఎస్సార్ తనయుడు వైఎస్.జగన్ పార్టీ అధిష్టానంతో విభేదించి బయటకు వెళ్లిపోయారు. పోతూ పోతూ... తనకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని కూలగొట్టలేదనీ, ప్రస్తుతం తనకు ఉన్న సభ్యులతో కూడా ఆ పని చేయబోనని ప్రకటించారు. అయితే వైఎస్.జగన్ విధేయులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా పార్టీలోనే ఉంటూ జగన్‌కు పూర్తి సహాయసహకారాలను అందిస్తామని ప్రకటించారు. పైపెచ్చు.. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీని సూటిబోటి మాటలతో కుళ్లబొడవటమే పనిగా పెట్టుకుంటున్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లా బందరులో జరిగిన బహిరంగ సభలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్ని నాని వ్యవహారశైలే ఇందుకు ఓ మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో మనసు చంపుకుని ఉంటున్నాననీ, వైఎస్ ఇచ్చిన టిక్కెట్టుపై గెలిచినందుకు 2014 వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. అదేసమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని కూలదోసే పనికి పూనుకోమని తేల్చి చెప్పారు. అదేసమయంలో జగన్‌కు పూర్తిస్థాయిలో తమ మద్దతు ఉంటుందని తెగేసి చెప్పారు.ఆయన బయటపడి చెప్పారు. కానీ వైఎస్సార్ విధేయులుగా పేరున్న చాలామంది శాసనసభ్యులు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలోనే ఉంటూ సందర్భం వచ్చినపుడల్లా కుళ్లబొడుస్తూ 2014 నాటికి తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే దిశగా జగన్ వర్గం పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంలో ప్రధానప్రతిపక్షం కంటే జగన్ వర్గం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇదే ఊపును మున్ముందు కూడా కొనసాగించి 2014 నాటికి కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేయాలన్నదే వారి వ్యూహంగా కనబడుతోంది. నిమిషానికోరకంగా మారే నేటి రాజకీయాల్లో 2014 నాటికి ఎలాంటి మలుపులు తిరిగి ఎక్కడ ఆగుతాయో చూడాలి.

No comments:

Post a Comment