ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీలో ఉన్నత పదవులను అధిష్టించాలంటే ఓర్పు తప్పనిసరి అని ఆయన అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. వైఎస్ జగన్ పార్టీ వీడిపోవడంపై పరోక్షంగా ప్రస్తావిస్తూ... దివంగత నేత వైఎస్సార్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు వచ్చిన ఆదరణను చూసి కొందరు సొంతగా పార్టీ పెట్టాలని సూచించారన్నారు. అయితే ఆయన దానిని ఖండించి తను పార్టీకే అంకితమవుతానని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. పార్టీని వదిలిపోవాలని వైఎస్సార్ లేశమాత్రంగా కూడా ఆలోచన రాలేదని తను చెప్పగలనన్నారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే వైఎస్సార్ కుమిలిపోయేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తులకన్నా పార్టీయే ముఖ్యమన్న సంగతిని ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడిని నిశితంగా గమనిస్తుందనీ, అందుకు ఉదాహరణే తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడమని వెల్లడించారు. ఓర్పు, సహనంతో మన పని మనం చేసుకుంటే పోతే ఏదో ఒకనాటికి లక్ష్యాన్ని చేరుకోగలమని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
No comments:
Post a Comment