Saturday, September 28, 2013

01అవును సమైక్యాంధ్ర ముఖ్యమంత్రినే : సీఎం కిరణ్

 02రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి కుండబద్దలు కొట్టి చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమేనని ప్రకటించారు.
03రాష్ట్రాన్ని విడదీయడం అంత తేలికైన విషయం కాదన్న కిరణ్, దిగ్విజయ్ సింగ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పదవుల కంటే ప్రజల ముఖ్యమని వెల్లడించారు. పార్టీకి విధేయుడంటూనే ధిక్కార స్వరం వినిపించారు. 
04ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి విభజన విషయంలో తన నిర్ణయాన్ని మరోమారి వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో సీడబ్ల్యూసీ తాను లేవనెత్తిన అంశాలపై ఒక్క దానికి కూడా భరోసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను విడదీయడం అంత తేలిక కాదన్నారు.

05సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదంటూనే కాంగ్రెస్ పార్టీకి విధేయుడినంటూ ధిక్కార స్వరం పెంచారు. సీఎం క్యాంప్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల ఉద్యమాన్ని కేంద్రం గుర్తించిందని, సీమాంధ్ర ఉద్యోగులు తక్షణమే సమ్మె విరమించాలని సీఎం కిరణ్ విజ్ఞప్తి చేశారు.

06విభజన వల్ల సాగునీటి రంగానికి ఎంత నష్టం వాటిల్లనుందో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని కిరణ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నుంచి సాగునీటి సరఫరాను మ్యాప్ ద్వారా వివరించారు. 1956లో రాష్ట్రం కలిసి ఉండాలని, ఫజల్ అలీ కమీషన్ చెప్పిందని గుర్తు చేశారు. 

07నీళ్లు బాగా వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదని, నీళ్లు లేనప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుందని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం విడిపోతే జలయుద్ధాలు తీవ్రమవుతాయన్నారు. నీటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తుందో కేంద్రం చెప్పాలని కిరణ్ డిమాండ్ చేశారు. 
   
08విభజన అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయం సరైంది కాదన్న కిరణ్ జవహార్ లాల్ నెహ్రూ, పటేల్ గట్టి బంధాన్ని ఏర్పరచారని తెలిపారు. తర్వాత ఇందిరా గాంధీ ఆ బంధాన్ని మరింత గట్టిగా చిక్కుముడి వేశారని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలా శాసనం అయితే నెహ్రూ, ఇందిరల నిర్ణయాలు అటువంటివి కావా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత లేదని, లక్షా 60మంది ఉద్యోగులు ఎవరు ఏ జోన్ పరిధిలోకి వస్తారో ఎలా నిర్ణయిస్తారని కిరణ్ ప్రశ్నించారు. ఉద్యోగ విరమణ తరువాత పెన్షనర్లకు ఫించన్ ఎలా చెల్లిస్తారో చెప్పాల్సిన అవసరముందన్నారు.
 
09రాష్ట్రం సమైక్యంగా ఉంటుందంటే తన పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని కిరణ్ స్పష్టం చేశారు. సీఎం పదవి శాశ్వతం కాదని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ పదవి కూడా శాశ్వతం కాదన్నారు. చంద్రబాబు, వైఎస్సార్సీపీల్లాగా పదవి కోసం పాకులాడాల్సిన అవసరం లేదన్న ఆయన సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమంలో రాజకీయ నేతలను ప్రజలు రానీవ్వడం లేదన్న విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
 
10అటు కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన మూడు ప్రాంతాల గురించీ ఆలోచిస్తారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఒకటికి రెండుసార్లు చెప్పినమాటిది. అవును నేను సమైక్యాంధ్ర సీఎంనేనంటూ నొక్కి మరీ చెప్తున్నారు కిరణ్ కుమార్.

11సీఎం వ్యాఖ్యలపై సీమాంద్రలో  సంబరం  
12విభజన అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలకు సీమాంద్రలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షాతీరేకం వ్యక్తంచేశాయి. టపాసులు పేల్చి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనీ, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా వుండడం వల్లనే అభివృద్ది సాధ్యమని నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం చేశారన్నారు. 

Monday, September 9, 2013

తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి.

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించు దేవుడు మన గణపతి. అన్నికార్యములకు, ముందుగా పూజింపవలసిన ప్రధమైన దేవుడు విఘ్నేశ్వరుడు. విజయానికి, చదువులకు, జ్నానానికి, దేనికైన మన గణనాథుడే దిక్కు. వినాయకుని ప్రార్ధన, పూజ అనేది చాలా పవిత్రమైనది. తెలుగువారికి అతి ముఖ్యమైన పండుగ వినాయకచవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సక్సెస్ న్యూస్.బ్లాగ్ స్పాట్.కామ్ తెలుపుతోంది. వినాయకుడి ఇష్టమైన విషయాలను తెలుసుకుందాం. 
గణేషుడిని గరికతో పూజిస్తే సకల లాభాలు!
వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేని పూజ విఘ్నేశ్వరుని లోటుగానే ఉంటుంది. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితం. పూర్వం సంయమిని పురంలో ఒక మహౌత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బైటికి వచ్చిన యముని తేజస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగుతీశారు. ఆయన వారినందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కాని ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని భావించారు.
కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు. కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికీ ఇదే చికిత్సగా పనికివస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80 వేల మంది మునులు అక్కడికి వచ్చారు. ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితో తాపోపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించే వారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం.
బొజ్జగణపయ్యకు ఇష్టమైన జిల్లేడుకాయలు
వినాయక చవితి సందడి మొదలైంది.. చవితి దేవునికి చవులూరే వంటకాలతో స్వాగతం పలికే సందర్భం ఇది. భక్తుల పెట్టే ప్రసాదం భుజించి, వరప్రసాదాలు అందించే వినాయకుడికి నైవేద్యాల విందుతో నిండుదనం చేకూర్చుదాం. గణనాథునికి ప్రీతి పాత్రమైన రుచులు తయారుచేసి నైవేద్యం పెడితే మీరు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి. 'గణేష్ భగవాన్' తమలో శక్తిని, స్థైర్యాన్ని పెంచి కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి మీ ఆరాధ్యధైవమైన 'బొజ్జగణపయ్య'ను చవితిరోజున ఏలా కొలుద్దామనుకుంటున్నారు. ఏలాంటి ఫలహారం స్వామికి నైవేద్యంగా పెడదామనుకుంటున్నారు. 'ఉత్తర భారతదేశం'లో గణనాథుని పండుగను అతి పవిత్రంగా జరుపుకుంటారు. వీరి పూజలో 'మోదక్' వంటంకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గణనాథునికి ఇష్టమైన 'జిల్లేడు కాయలను' నైవేద్యంగా పెడితే తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.
21 పత్రాలతో పూజ ఎందుకుచేయాలి!
వినాయక చవితి పూజలో కూడా ఎంతో వైద్య రహస్యాలున్నాయి. నిజానికి వినాయక చవితి పూజ అనేది సమాజాన్ని మేల్కొలిపి, అందరూ ఒక్కటిగా ఉంటే కలిగే లాభాలేమిటో చెప్పడానికై ఏర్పడిందని చెప్పవచ్చు. మరి ‘మతం' అంటే ‘మానవత్వా'న్ని పెంచేదే కదా! మత విశ్వాసాల పేరున కొన్ని మంచిపనులు చేయవచ్చని చెప్పడమే వినాయక చవితి పూజా విధి. వినాయకుని ప్రతిమను రూపొందించడానికి కేవలం ‘కొత్త'మట్టినే ఎంచుకోవాలి. దానికి 21 పత్రాలతో పూజచేయాలి. గణపతిని నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేయాలి. ఇదీ పద్ధతి. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. ఇవన్నీ మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధులు. వాటితో పూజ చేయడంవల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. . 9 రోజుల పూజ తర్వాత నిమజ్జనం ఎందుకు చేయాలీ అని సందేహం రావచ్చు.


 చెరువులు, బావులు, నదులు- వీటిలో వర్షాలవల్ల నీరు కలుషితం కావడం సర్వసాధారణం. వీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రియే సమాధానం. అందుకే 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితోబాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేయడం, అలా నీటిలో కలిపిన మట్టి, 21 రకాల పత్రి కలిసి 23 గంటలయ్యాక తమలో ఉన్న ఔషధీయుత గుణాల ఆల్కలాయిడ్స్‌ని ఆ జలంలోకి వదిలేస్తాయి. అవి బాక్టీరియాను నిర్మూలించి, జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ' రహస్యం. వినాయకునికి చేసే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు. వినాయకుని పూజలో వాడే 21 పత్రాలు చాలా విశిష్టమైనవి కూడా. వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.

Friday, August 30, 2013

మనసుతో వైద్యం చేసే డాక్టర్లు రావాలి:డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం

న దేశంలో మనసుతో సంబంధం లేకుండా శరీరానికి మాత్రమే వైద్యం చేసేవారు ఎక్కువగా ఉన్నారని ఈ పరిస్థితిని యువ వైద్యులే మార్చాలని భారత మాజీ రాష్టప్రతి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్య పరిశోధనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఓస్మికాన్ సమావేశంలో కలాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో ఫైవ్‌స్టార్, త్రీ స్టార్ ఆస్పత్రులు అంతకుమించి హంగులు ఉన్నా, మనసుతో వైద్యం చేసే డాక్టర్లు అరుదుగా ఉన్నారని అన్నారు. రోగి మానసిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి రోగికి అవసరమున్నా లేకున్నా కనీసం 15 రోగ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు వైద్యులు సిద్ధపడుతున్నారని తప్పుపట్టారు. వైద్య విద్యార్ధులు అంతా కలిసి ఈ లోపభూయిష్టమైన విధానాన్ని అడ్డుకోవాలని సూచించారు. అణ్వాయుధ దేశంగా భారత్ గుర్తింపు పొందిన సమయం కన్నా ఆర్ధోపెడిక్ వైద్యంలో వినియోగించే కాలిపర్స్ తయారీకి తన వంతు సాయం అందజేయడం, గుండె వైద్యంలో వినియోగించే రాజు-కలాం స్టెంట్ తయారీ వంటి అంశాలు తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైద్య విద్య సంచాలకుడు శాంతారావు, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పుట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రతి విద్యార్థికి ఉత్తమ వ్యక్తిత్వం అవసరం



త్తమ వ్యక్తిగా ఎదగాలంటే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకో
వడంతో పాటు క్రమశిక్షణ చాలా అవసరమని కలాం హితవు పలికారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్ధుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్ధులు గొప్ప లక్ష్యాలను ఎంచుకోవాలని చిన్న లక్ష్యాలను ఎంచుకోవడం నేరమని సూచించారు. మహిళలను గౌరవించే విద్యను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ప్రాధమిక పాఠశాల స్థాయిలో విద్యార్ధులకు స్ర్తిల పట్ల గౌరవడం కలిగించే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని కలాం పేర్కొన్నారు. స్ర్తిల పట్ల గౌరవం పెరిగే విధంగా విద్యాబోధన ఉంటే మహిళలపై దాడులు తగ్గుతాయని అన్నారు. చదువు అనంతరం తీసుకోవల్సింది పట్టా కాదని, జ్ఞానాన్ని తీసుకువెళ్లాలని అన్నారు. అనంతరం విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు అబ్దుల్ కలాం సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సిద్ధార్ధ రెడ్డి సహా అనేక మంది అధికారులు పాల్గొన్నారు. 

Tuesday, August 13, 2013

వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? స్త్రీ శరీరం భోగ వస్తువు కాకూడదు...!!!

ఏ అమ్మాయీ అమ్ముడవకూడదన్నదే నా లక్ష్యం 

దేశవ్యాప్తంగా వేల మంది అమ్మాయిలను వ్యభిచారం నుంచి రక్షిస్తున్నారు సునీతాకృష్ణన్. ఆమె స్థాపించిన 'ప్రజ్వల' సంస్థ వల్ల ఎంతోమంది మహిళలు సమాజంలో గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నారు. సామూహిక అత్యాచారానికి, జైలు నిర్బంధానికీ సైతం భయపడకుండా పట్టుదలగా కృషి చేస్తున్న సునీతా కృష్ణన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం...

               "నా తల్లిదండ్రులు మళయాళీలు, బెంగుళూరులో స్థిరపడ్డారు. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి. ఆయనకు తరచూ బదిలీలవుతూ ఉండేవి. దాంతో ప్రపంచం చూడ్డానికి అవకాశం కలిగింది. నా లైఫ్ విచిత్రంగా ప్రారంభమైంది. పుట్టిన సమయంలో నేను వికలాంగురాలిని. ఆ విషయాన్ని మూడో రోజున మా మామ గుర్తించారు. తర్వాత సర్జరీ జరిగింది. ఎనిమిదేళ్లు డిజేబుల్డ్‌గానే బతికాను. అలా నా ప్రపంచం, నా ఆలోచన అన్నీ వేరే అయిపోయాయి. మూడేళ్ల వయసులోనే నా జీవితం ఇంకొకరికి అంకితం అన్న భావన పెరిగింది. దానికి ప్రత్యేకంగా ఇన్‌స్పిరేషన్ ఎవరూ ఇవ్వలేదు. ఐదేళ్ల వయసులోనే మా వీధి పిల్లలకు నేను అక్షరాలు నేర్పానట. అప్పట్నుంచే నేను ఓ ఫేమస్ క్యారెక్టర్. అదే సమయంలో పొగరు కూడా ఉండేది. రెండో తరగతిలో ఉన్నప్పుడు నేను మదర్‌థెరిసా అవుతానని ఎవరో అంటే, 'అదేమీ కాదు, నేను సునీతా కృష్ణన్‌నే అవుతా'నంటూ గొడవ చేశానట.


                       నా వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో మా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. వాళ్లు నాలోని లోపాల కంటే బలాలపైనే దృష్టి పెట్టేవారు. నేను పొట్టి అని నాకు తెలుసు. 'దాన్నే నీ బలంగా చేసుకో' అని మా నాన్న చెప్పడం నాకింకా గుర్తుంది. ఎనిమిదేళ్లు వచ్చేసరికి సోషల్ వర్కర్‌గా తయారయ్యా. అప్పుడు నా తోటి వాళ్లతో పోలిస్తే నేను తేడాగానే ఉండే దాన్ని. మా అక్క, చెల్లి, తమ్ముడు నార్మల్‌గా ఉండేవారు. అందరికీ నావైపు నుంచి సలహాలు, అమ్మకు కూడా సలహా ఇచ్చేదాన్ని. అప్పుడు మానసిక వైకల్యమున్న పిల్లలకు డ్యాన్స్ నేర్పేదాన్ని. పన్నెండేళ్ల వయసొచ్చేసరికి దగ్గర్లోని మురికివాడకు వెళ్లి వంద మంది పిల్లలతో స్కూల్ కూడా ప్రారంభించాను. అప్పుడు మాకు డబ్బుల్లేకున్నా, మరీ పేదరికం కాదు. కానీ ఇచ్చే గుణం అలవాటైంది. మా పేరెంట్స్ కూడా ప్రోత్సహించారు.


                        దేనికైతే మంచి పేరు తెచ్చుకున్నానో, అదే చెడ్డగా మారింది ఒక దశకు వచ్చాక. రజస్వల అయిన సమయంలో పూజ ఎందుకు చెయ్యకూడదు? ఇలా ఆలోచించేదాన్ని. పదిహేనేళ్ల వయసులో ఓ గ్రామంలో పనిచెయ్యడానికి వెళ్లాను. ఆ వయసులో ఆవేశం, డిప్లమసీ లేకపోవడం వల్ల సూటిగా మాట్లాడేదాన్ని. అది నచ్చని కొంతమంది నాకు పాఠం నేర్పాలనుకున్నారు. ఎనిమిది మంది కలిసి నామీద అత్యాచారం చేశారు. నాకు వాళ్ల ముఖాలు గుర్తు లేవు, వేరే ఏ వివరాలూ తెలీదు. దాని గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. కానీ దాని తర్వాత నన్ను నా కుటుంబం, సమాజం వేరేగా చూడటం మొదలెట్టింది. నా చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం మారిపోయింది.


                    ఆ ఘటన జరిగి 25 ఏళ్లయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లను నేను అర్థం చేసుకోగలను. ఇన్సిడెంట్ జరిగిన వెంట
నే.. 'సునీత అక్కడికెందుకెళ్లింది? వెళ్లి ఏం చేసింది? మీరు ఎక్కువ స్వతంత్రం ఇచ్చేశారు అమ్మాయికి. మేం ముందే చెప్పాం. పొగరు ఎక్కువ ఈమెకు. ఇట్లాంటి అమ్మాయిలకు ఇలాగే జరుగుతుంది' అనేవాళ్లు చుట్టుపక్కలవారు మా అమ్మానాన్నలతో. కానీ నాలోపల చాలా బాధ ఉండేది. పగలెంత ధైర్యంగా ఉన్నా, రాత్రి పూట బాగా ఏడ్చేదాన్ని, భయపడేదాన్ని. అయితే నేనేం తప్పు చేశాను? నేను నేరస్తురాలిని కాదు. నేను ఓ విక్టిమ్‌ను కూడా కాదు. నామీద ఏదో తప్పు జరిగింది. మీకు చేతనైతే అవతలివాళ్లను కొట్టండి - అనేదాన్ని. కానీ సమాజానికి ఇది నచ్చదు. అమ్మాయి ఏడవాలి, నా తప్పేం లేదని కాళ్లు పట్టుకోవాలి, నిస్సహాయంగా ఆత్మహత్య చేసుకోవాలి - అప్పుడే సమాజం జాలి చూపిస్తుంది. నాకు ఆ జాలి అవసరం లేదు. అప్పుడే నిర్ణయించుకున్నాను - లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పనిచెయ్యాలని. ఆ కోపపు జ్వాల నుంచి నా నిర్ణయం పుట్టింది. వ్యభిచారంలోకి బలవంతాన వస్తున్న అమ్మాయిలను కాపాడాలి.. ఆ పని చెయ్యాలంటే నేనెలా ఉండాలి, ఏం చదువుకోవాలి, ఏం నేర్చుకోవాలి - ఇవన్నీ ప్లాన్ చేసుకున్నా. ఆ క్రమంలో నేను చాలా పనులు చేశాను. ఇల్లిల్లూ తిరుగుతూ అగర్‌బత్తీలు, సర్ఫ్ అమ్మడం వంటివి చేశాను. స్కూలు, కాలేజీ ఫీజులు కట్టడానికి అవి ఉపయోగపడేవి.


                       వ్యభిచారం ఎందుకు జరుగుతుంది? స్త్రీ శరీరం భోగ వస్తువు. మగవాళ్లలో ఉన్న లైంగిక కోరికలను తీర్చుకోవడానికి వాళ్లు స్త్రీలకు అటువంటి ఇమేజ్ కల్పిస్తారు. అందాలపోటీల్లాంటివి తెలియకుండానే దానికి దోహదం చేస్తాయి. అందుకే నేను వాటికి వ్యతిరేకంగా ఉద్యమం చేశాను. ఆ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పటేల్ ఓపెన్‌గా చెప్పాడు. 'ఎణ్ణు.. హెణ్ణు.. అంటే వైన్, వుమెన్ లేకుండా నేను ఉండలేను' అని చెప్పారు. ఆ ఉద్యమంలో నన్ను పట్టుకుని జైల్లో పెట్టారు. అత్యాచారం ఒక మార్పును తీసుకొస్తే, జైలుకెళ్లడం నాలో ఇంకో మార్పును తీసుకొచ్చింది. అప్పుడు మా అమ్మానాన్నా నన్ను వదిలేశారు. ఆ రోజు వేసుకున్న డ్రెస్సుతో నేను అరవై రోజులు గడిపాను. వేరేవాళ్లకు బంధువులొచ్చి బట్టలిచ్చారు, నాకోసం ఎవ్వరూ రాలేదు. మేం అండర్ ట్రయల్, దోషులం కాదు. కాబట్టి జైలు వాళ్లు యూనిఫాం ఇవ్వరు. కట్టుకున్న బట్టలను రాత్రి ఉతికి ఆరేసి దుప్పటి కట్టుకుని పడుకునేదాన్ని. మళ్లీ పొద్దున అదే డ్రెస్. ఏరోజైనా ములాఖత్ సమయంలో నా పేరు పిలుస్తారేమోనని ఎంత ఆశగా చూసేదాన్నో. అలాంటి ఒంటరితనాన్ని ఎవ్వరూ అనుభవించి ఉండరు.


                     ఈ అనుభవాల జ్ఞాపకాలు చెరిగిపోవాలని నేను బెంగుళూరును వదిలేశాను. ఎదురుగా వచ్చిన రైలెక్కి కూర్చుంటే మర్నాడుదయానికి హైదరాబాద్‌లో దిగాను. అక్కడ మా ఫ్రెండ్ అన్నదమ్ముడు వర్గీస్ మురికివాడల్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడని రైల్లో గుర్తొచ్చింది. దాంతో ఆయన దగ్గరకు వెళ్లాను. వర్గీస్‌ను అభ్యర్థించి చిన్న ఉద్యోగంలో చేరాను. నా చేతిలో చదువు, జ్ఞానమూ ఉన్నాయని ధైర్యం. చాదర్‌ఘాట్‌లోని బ్రిడ్జి కింద మూసానగర్ వద్ద స్లమ్స్‌లో షెడ్ తీసుకున్నాను. తొలి రెండు రోజులు రేగు పండ్లు తిని బతికాను. డిసెంబర్ టైమ్ అది. ఆ తర్వాత ఆ మురికివాడలోని మనుషులు నన్ను రాణీలాగా చూసుకున్నారు. రోజూ మూడు పూటలా వాళ్లే అన్నం పెట్టేవాళ్లు. ఆ సమయంలోనే హైకోర్టు ముందున్న మెహబూబ్‌కా మెహెందీ అనే వేశ్యావాటికను తొలగించారు. ముందస్తు ప్రణాళికేమీ లేకుండా, ఆలోచన లేకుండా చేశారా పని. దాన్లో ఉండే స్త్రీల వేదన తెలిసింది. వాళ్ల భాగస్వామ్యంతోనే పనిచెయ్యాలనుకున్నాం. దానికి వాళ్ల నుంచి వచ్చిన సానుకూల స్పందన చూస్తే ఆశ్చర్యమనిపించింది. అటువంటి స్త్రీల పిల్లల కోసం ఒక బడి ప్రారంభించాను. అలా ఐదుగురితో ప్రజ్వల ఫౌండేషన్ మొదలయింది. ఈ రోజు వారి సంఖ్య ఏడు వేలకు చేరింది. అందరూ వ్యభిచారం నుంచి వచ్చిన పిల్లలే కాదు. వ్యభిచారానికి అవకాశం ఉన్న ప్రాంతాలనుంచి పిల్లలనూ తీసుకొస్తున్నాం.


                      ఈ క్రమంలో నేను 18 సార్లు భౌతిక దాడులకు గురయ్యాను. ప్రతిసారీ కన్నో, ముక్కో, ఎముకో ఏదోకటి విరిగేది. ఈ దాడులను నేను జాతీయ అంతర్జాతీయ అవార్డులుగా భావిస్తాను. ఎవరైనా అమ్మాయిని నిర్బంధిస్తున్నారని తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లిపోవడం వల్ల ఇలాంటి దాడులకు గురయ్యేదాన్ని. కొన్నాళ్ల తర్వాత తెలిసిందేమంటే బాలికలను రక్షించడం నా పని కాదు, పోలీసుల పని. ఆ కర్తవ్యాన్ని వాళ్లు నెరవేర్చేలా మనం చెయ్యాలి. అది నేను నేర్చుకున్నాక బాలికలను రక్షించడం సులువయింది. కానీ ఈ దాడుల వల్ల నేను సరైన దారిలోనే ఉన్నానని అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజ్వల సంస్థలో 200మంది ఉద్యోగులున్నారు. అందరూ నా అంత స్థైర్యం ఉన్నవాళ్లే. కానీ కిందటేడు నామీద పొయ్యడానికి యాసిడ్ పట్టుకొస్తున్న మనిషి మెట్లెక్కుతూ బోర్లాపడ్డాడు. అతన్ని మేమే తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చాం. అప్పుడు అతనే చెప్పాడు... దాన్ని తెచ్చింది నాకోసమని! అప్పుడు మాత్రం భయం వేసింది.



                      మనం జీవితాన్ని నిర్మించుకోవాలా, నాశనం చేసుకోవాలా అనేది మన చేతిలోనే ఉంది. నావంటి నాలుగున్నర అడుగుల మనిషే ఇంత చెయ్యగలిగితే, మిగిలినవాళ్లు తల్చుకుంటే దేన్నైనా సాధించగలరు. ప్రస్తుతం వ్యభిచారం వల్ల హెచ్ఐవీ బారిన పడిన అమ్మాయిలకు పునరావాసం కల్పించడం మీద కూడా దృష్టి పెట్టాను. వాళ్ల ఆలోచనలను చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుంది. మనం చిన్నచిన్న విషయాలకే విసిగిపోతాం, చుట్టూ ఉన్నవారి పట్ల, జీవితం పట్ల నెగెటివ్ భావాలను పెంచుకుంటాం. కానీ ఆ పిల్లలు మాత్రం ప్రపంచం పట్ల గొప్ప సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుంటారు. జీవితం పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. నా వల్ల ఏడు వేల మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తి నుంచి బైటపడ్డారు, గౌరవంగా జీవిస్తున్నారు. నా చేతుల మీదుగా 800 మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశాను. ప్రభుత్వం నుంచి ఇళ్లు ఇప్పించాం. మనవలూ, మనవరాళ్లూ వందల మందున్నారు నాకు.



                         ఒక్క సునీతా కృష్ణన్ కృషి వల్ల వ్యభిచారం రూపుమాసిపోదు. దానికి ఎంతోమంది కలిసికట్టుగా కృషి చెయ్యాలి. చిన్న విషయాలకు గొడవలకు దిగుతాంగానీ, ఒక ఐదేళ్ల పాపను రేప్ చేస్తే ఊరుకుంటాం. ఇరవయ్యేళ్లమ్మాయి వ్యభిచారంలోకి దిగితే ఊరుకుంటాం. ఇలాంటివాటికి మనకేంటని ఊరుకోకుండా తీవ్రంగా స్పందించే సమాజం తయారు కావాలి. ఏమైనా సంఘటనలు జరిగితే అవి ఎక్కడో ఎవరికో జరుగుతాయనుకుంటాం తప్ప, మన ఇంట్లో జరగొచ్చని కల్లో కూడా అనుకోరు. 'మా అమ్మాయి వ్యభిచారంలోకి వెళ్లకూడదు' అని ప్రతి కుటుంబమూ అనుకోవాలి. అలాగే ప్రతి మగవాడూ రేపిస్టు కాదు.


                      బ్రోకర్లు, ట్రాఫికర్లు, న్యాయవాదులు, పోలీసులు - వీళ్లంతా మా పని పట్ల గుర్రుగా ఉంటారు. ఇంతమందికి వ్యతిరేకంగా వెళుతూ పనిచేయడానికి కావలసిన బలం నామీద జరిగిన అత్యాచారం నుంచే వస్తుంది. గాయం మానినా మచ్చ ఉండిపోయినట్టు దాని బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. వ్యభిచారo నుంచి విముక్తి పొందిన అమ్మాయిలతోనో, రేప్‌కు గురైన బాలికనో మాట్లాడించాలనుకుంటుంది మీడియా. అదే పురుషులనెప్పుడైనా 'నువ్వెందుకు పదేళ్ల పాపను రేప్ చేశావు, ఎందుకు వ్యభిచార గృహానికి వెళ్లావు' అని నిలదీస్తుందా చెప్పండి? అమ్మాయిలకు నేను చెప్పేదొకటే. అత్యాచారం జరిగినప్పుడు మనసు గాయం మానడానికి మౌనం సాయపడుతుంది. కానీ అది అన్ని సమస్యలనూ పరిష్కరించదు. జరిగినదానిలో మీ పొరపాటేమీ లేదు. బాధ పడుతూ కూర్చోవద్దు.

                         మేం ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ స్వీకరించం. మాకు సాయం చేసేవాళ్లు వేరే ఉన్నారు. లక్నోలో రిక్షా లాగే మనిషి మాకు ప్రతి రోజూ సరిగ్గా 101రూపాయలు పంపిస్తాడు. ఇప్పటికి పన్నెండేళ్ల నుంచి ప్రతిరోజూ పంపిస్తున్నాడాయన. అటువంటి లక్షాధికారులు ఎంతోమంది మాకు సాయంగా ఉన్నారు. ఏ అమ్మాయి, ఏ పాపా అమ్ముడుపోకూడదు. అదే నా కల. అదే నా లక్ష్యం.''


మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

Saturday, July 27, 2013

అధికార, విపక్ష పార్టీల మధ్య చిచ్చురేపుతున్న పంచాయతీలు

గ్రామపంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో స్వరాజ్యం తెస్తుందో లేదో కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే కక్షలు కార్పణ్యాలు మాత్రం రగిలిస్తోంది. ఎన్నికలలో ఏర్పడిన తగాదాలు అనంతరం తగువులుగా మారుతున్నాయి. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఎన్నికలు అధికార, విపక్ష పార్టీల మధ్య చిచ్చురేపుతున్నాయి.

విశాఖ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కక్షలకు ఊతమిస్తున్నాయి. రెండవ విడత జరిగిన ఎన్నికల్లో పరవాడ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్ ఆర్ సీపీ టిడిపి కార్యకర్తల మద్య వాగ్వివాదం జరిగింథి. ముత్యలమ్మపాలెం పెదముసిడివాడ కన్నూరు పంచాయితీల్లో కూడా ఇదే పరిస్థితి. అధికారపార్టీ కార్యకర్తలు టీడీపీకి చెందిన కార్య్కర్తలపై దాడికి ప్రయత్నించారు.
ఇక్కడ పంచాయతీల్లో ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. 






Thursday, June 20, 2013

ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం


రదలతో విలవిలలాడిన ఉత్తరాఖండ్ లో సహాయ చర్యలు చేపడుతున్నారు. వాన తెరిపి ఇవ్వడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఇదో జలవిలయం కనీవినీ ఎరుగని జల ప్రళయం కుండపోతగా వర్షం కురిసింది. భాగిరథీ, మందాకిని, అలకనంద పేరేదైనా గంగమ్మ ఉగ్రరూపందాల్చింది. గంగ యమున దాని ఉపనదులు ఏకమైపోయాయి. ఉత్తరాఖండ్ లో ఊళ్లకు ఊళ్లనే ముంచేశాయి. 

ముందస్తుగా వచ్చిన రుతుపవనాలు ఉత్తరాఖండ్ ను ఊహించని దెబ్బ తీశాయి. ఈ స్థాయిలో రాష్ట్రాన్ని ముంచెత్తడం 90ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అందుకే దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ సర్కార్ కేంద్రాన్ని కోరింది.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరాఖండ్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్రం నుంచి 145 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

రెండు రోజులుగా వర్షం కాస్త తెరిపి ఇవ్వడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి 22ఆర్మీ హెలికాప్టర్లు దిగాయి. ఉత్తరాఖండ్ లో చిక్కుకుపోయిన 10వేల మందిని కాపాడి సహాయ శిబిరాలకు తరలించారు. మరో 60వేల మంది ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారు. కేవలం కేదార్ నాథ్  కొండపైనే 50 మరణించారు. రెండు వారాల క్రితం ఓం నమశ్శివాయ మంత్రాలతో మార్మోగిన కేదార్ నాథ్  కొండ ఇప్పుడు శవాల దిబ్బగా మారింది. కొండపైకి అనునిత్యం ప్రయాణికుల్ని తీసుకువెళ్లే మూగజీవాలు కూడా గల్లంతయ్యాయి. మొత్తం 5వేల గుర్రాలు, వాటి మాలీల ఆచూకీ తెలియడం లేదు. కేవలం కేదార్ నాథ్ కు వెళ్లే మార్గంలోనే 5 వేల మంది టూరిస్టులు చిక్కుకున్నారు. బద్రీనాథ్ కొండపైన 5 వేల మంది యాత్రికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

చార్ ధామ్ యాత్రలో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్  షిండే తెలిపారు. రాకపోకల పునరుద్ధరణకు సైన్యం, ఇండో టిబెటిన్  సరిహద్దు భద్రతా సిబ్బంది శ్రమిస్తున్నారు

ఉత్తరా ఖండ్ లో చిక్కుకుపోయిన తెలుగువారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. యాత్రకని వెళ్లి వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్ల పరిస్థితి  దయనీయంగా ఉంది. కొందరి క్షేమ సమాచారం తెలిసినా మరికొందరి జాడే లేదు. వారి వివరాలు తెలీక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాదాపు మూడు వేల మంది తెలుగువారు చార్ ధామ్ యాత్రకు వెళ్లి ఉంటారని అంటున్నా అనధికారికంగా ఈ లెక్క పదివేలకు పైనే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు తెలుగువారి సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ని ఉత్తరాఖండ్ పంపించింది