Wednesday, December 15, 2010

విందుకు డుమ్మా కొట్టేందుకే చంద్రబాబు దీక్ష: హరీష్ రావు

జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసే విందు భేటీకి డుమ్మా కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమరణ దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం పేరుతో సరికొత్త జిమ్మిక్కులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కూడా బాబు కుట్ర పన్నారని దుయ్యబట్టారు. తొలుత 17వ తేదీన ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని బాబు ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఈ తేదీని 16కు మార్చుకున్నారన్నారు. ఎందుకంటే.. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ అదే రోజున హైదరాబాద్‌కు వచ్చి అన్ని పార్టీల నేతలతో భేటీకానుందన్నారు. ఆ తర్వాత విందు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇందులో పాల్గొనాల్సి వస్తుందని భావించిన బాబు.. ఈ సమావేశానికి డుమ్మాకొట్టారన్నారు. ఇకపోతే.. ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీల్లో తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. వేరుశనగ రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

No comments:

Post a Comment