Thursday, January 13, 2011

ఏసీబీ వల్లో గనుల శాఖ అధికారి


విశాఖపట్నం : 22 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన అనకాపల్లి డివిజన్‌లో పని చేసినది రెండు దశాబ్దాల పైమాటే. విజయనగరంలో అసిస్టెంట్ జియాలజిస్టుగా ఏడాదిన్నర పని చేశారు. అలా ఒకే చోట స్థిరపడ్డ అనకాపల్లి గనుల శాఖ ఏడీ ఎస్‌వీ రమణారావు ఎట్టకేలకు ఏసీబీకి చిక్కారు. సుదీర్ఘకాలం ఒకే చోట పని చేయడం వల్ల ఆయనకు ఇక్కడ క్వారీలు, క్రషర్‌ల యజమానులపై పట్టు కుదిరించదన్న ఆరోపణలు చాలాకాలంగా వెల్లువవుతున్నాయి. ఆ కారణంగా ఆయన అక్రమార్జనకు అవధులు లేకుండా పోయాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. కానీ ఉన్నతాధికారుల వద్ద గల పలుకుబడి కారణంగా ఇన్నాళ్లూ చర్యలకు ఆస్కారం లేకుండా పోయిందని అనకాపల్లిలో ప్రబలంగా వినిపిస్తోంది. గనుల శాఖ అనకాపల్లి డివిజన్ పరిధిలో మొత్తం 80 క్రషర్లు ఉన్నాయి. ఏటా వీటి రెన్యువల్ సందర్భంలో వసూళ్లు చెల్లించడం తప్పనిసరని క్రషర్ల యజమానులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే రెండొందల వరకు ఉన్న క్వారీ యజమానుల నుంచి రాళ్లను అమ్మేందుకు జారీ చేసే ప్రతీ పర్మిట్‌కు చెల్లింపులు తప్పనిసరని గనుల శాఖలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు తెలియవచ్చింది. అయితే ఈ విషయంలో కూడా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలు వినవస్తున్నాయి. క్వారీ కేటాయింపుల సందర్భంగా అఫిడివిట్‌లు మంజూరు చేయడం ఏడీ బాధ్యత. రమణారావు ఏసీబీకి దొరికినది కూడా ఈ వ్యవహారంలోనే. క్వారీలు బినామీ పేర్లతో నడుస్తూ ఉండడంలో ఏడీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు క్వారీ వర్గాల్లో వినవస్తున్నాయి. క్వారీ కేటాయింపుల సందర్భంగా గనుల శాఖ నేతృత్వంలో హెక్టార్‌కు భారీ స్థాయిలో వసూళ్లు సాగుతున్నాయని క్వారీ కాంట్రాక్టర్ ఒకరు తెలిపారు. క్వారీలు ఐదేళ్ల కొకసారి రెన్యూవ ల్ చేయించుకునే సందర్భంలో సైతం ఇదే ధోరణి కొనసాగుతోందని తెలిపారు. దరఖాస్తులను ఆమోదించే సందర్భంలో సైతం ఈ ధోరణి కొనసాగుతోందని తెలియజేశారు. క్వారీ రెన్యువల్‌కు అనుమతిని మంజూరు చేయడానికి సంబంధించి ఓ యజమాని బంధువు నుంచి తన ఇంట్లో లంచం తీసుకుంటూ ఉండగా ఏడీని ఏసీబీ అధికారులు నిర్బంధించిన విషయం ఈసందర్భంగా గమనార్హం. ఏడీ అక్రమార్జన పెద్ద ఎత్తున ఉండవచ్చని, ఇటీవల కాలంలో వచ్చిన ఆరోపణల నిగ్గు తేలిస్తే అవినీతి విస్తృతి వెలుగులోకి వస్తుందని క్వారీ వర్గాలు అంటున్నాయి. 

No comments:

Post a Comment