తెలంగాణ అంశంపై ఈనెల 6వ తేదీన ఇక్కడ నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి ఒక్కొక్క రాజకీయ పార్టీ నుండి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించడమంటే భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తున్నట్లు కాదని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం స్పష్టంచేశారు.
గత ఏడాదిలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి గుర్తింపు పొందిన ప్రతి రాజకీయ పార్టీ నుండి ఇద్దరిని హాజరుకావాల్సిందిగా ఆహ్వానించామని, అదే మాదిరిగా గురువారంనాటి సమావేశానికి కూడా ఇద్దరేసి ప్రతినిధులను పంపించాలని కోరామని ఆయన మంగళవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పత్రికాగోష్ఠిలో తెలియజేశారు. ప్రతి పార్టీ నుండి ఇద్దరు చొప్పున హాజరు కావాలని కోరడం ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులను పరస్పర విరుద్ధ అభిప్రాయాలను చెప్పాలని ప్రోత్సహించడమేనన్న వాదనను విమర్శలను ఆయన తిరస్కరించారు. ఢిల్లీలో జరిగే సమావేశానికి ఒక్కరే రావాలన్న తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు వాదన తప్పు అని కేంద్ర హోం మంత్రి చిదంబరం అన్నారు. పార్టీకి ఇద్దరు చొప్పున వస్తే రెండు అభిప్రాయాలు వస్తాయనేది పెద్ద సమస్యేమీ కాదన్నారు. గత జనవరిలో పార్టీకి ఇద్దరిని పిలిచామని, ఇప్పుడు అదే పద్ధతి అనుసరిస్తున్నామని చెప్పారు. గతంలో టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, ఎంఐఎంల నుంచి ఇద్దరు వచ్చినా ఒకే అభిప్రాయం తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. తెరాస నుంచి ఈ సమావేశానికి కూడా హాజరవుతారన్న విశ్వాసాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. ఇద్దరిద్దరిని రమ్మని పిలిచినా ఏ పార్టీ అయినా ఒక్కరినే పంపించదలుచుకొంటే తమకెలాంటి అభ్యంతరం ఉండదని కూడా చిదంబరం చెప్పారు. ఇద్దరిని రమ్మన్నంత మాత్రాన ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారని భావించాల్సిన పనిలేదని అంటూ గత ఏడాది జనవరి 5న నిర్వహించిన సమావేశంలో సిపిఐ, సిపిఎం, బిజెపి, టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీల తరఫున ఇద్దరేసి నాయకులు ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇద్దరు ప్రతినిధులను ఆహ్వానించడానికి నిరసనగా అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)తో సహా అన్ని పార్టీలు గురువారంనాటి సమావేశానికి హాజరౌతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. హోం శాఖ బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ మంత్రిత్వశాఖ నిర్ణయాలు, కార్యకలాపాలపై నెలవారీ నివేదికలు విడుదల చేస్తున్న చిదంబరం గత డిసెంబర్కు సంబంధించిన నివేదికను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ పత్రికాగోష్ఠిలో తెలంగాణకు సంబంధించి విలేఖరులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ‘ఆరవ తేదీ సమావేశం జరుగుతుంది, సమావేశంలో రాజకీయ పార్టీలు ఏమి చెబుతాయో చూద్దాం’ అంటూ సమాధానాలను దాటవేశారు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు ప్రకటించాయి, పార్టీకి ఒకరినే ఆహ్వానించి ఉండాల్సిందని సిపిఐ కార్యదర్శి నారాయణ కూడా మీకు లేఖ రాశారు గదా అన్న ప్రశ్నకు కూడా ‘నాకు తెలియదు, ఆరవ తేదీ సమావేశంలో ఆలోచిస్తాం’ అనే సమాధానమే ఆయన నుండి లభించింది.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తీసుకోనున్న తదుపరి కార్యాచరణను వెల్లడించేందుకు నిరాకరించిన చిదంబరం గత పదమూడు మాసాలుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న తెలంగాణ వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు ఎంతకాలం పడుతుందన్న ప్రశ్నకు కూడా మంత్రి సూటిగా సమాధానమివ్వలేదు. అన్నింటికీ ఆరవ తేదీ మంత్రాన్నే పఠించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై రాజకీయ పార్టీలతో సంప్రదింపుల ప్రక్రియ ఎంత కాలం సాగుతుందన్న ప్రశ్నకు కూడా రాజకీయ పార్టీలు కోరుకున్నంత కాలం కొనసాగిస్తామని చిదంబరం చెప్పారు. గురువారంనాటి సమావేశం కేవలం రాజకీయ పార్టీలకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతులను అందజేయడానికే పరిమితమౌతుందా?, కమిటీ నివేదికపై చర్చలు కూడా జరుగుతాయో తనకు తెలియదని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏం చేయాలో ఆ సమావేశంలో రాజకీయ పార్టీలే చెప్పాల్సి ఉంటుందన్నారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు నార్త్బ్లాక్లోని హోంమంత్రిత్వశాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుందని, అదేరోజు సాయంత్రం అయిదు గంటల తర్వాత ఎప్పుడైనా నివేదికను వెబ్సైట్లో ఉంచుతామని ఆయన వెల్లడించారు.
రాజకీయ పార్టీలు, ప్రజలు అంతా సంయమనం పాటించాలని ప్రభుత్వం కోరినా మీడియాలో నివేదికలోని అంశాపై పలురకాల ఊహాజనిత కథనాలు వెలువడుతున్నాయని ఒక విలేఖరి ప్రస్తావించినప్పుడు ”అలాంటి ఊహాజనిత కథనాలను చదవకండి” అంటూ చమత్కరించారు. తెలంగాణ అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత కూడా తిరిగి సంప్రదింపుల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేయడం సమస్యను నానబెట్టడానికేనా అన్న మరో ప్రశ్న మంత్రికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మీ ప్రశ్నలో లేనిపోని నిందలు వేయడం ముందు మానుకోండి అంటూ ఆయన ఆ ప్రశ్న అడిగిన విలేఖరిని గద్దించారు.
No comments:
Post a Comment