వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి ధర్మాన రెవిన్యూ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే వాన్ పిక్ భూకేటాయింపుల్లో రెవిన్యూ శాఖ మంత్రి హోదాలో అవినీతికి పాల్పడ్డారంటూ సీబీఐ తన చార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. వాన్ పిక్ భూ కేటాయింపులకు సంబంధించి అప్పట్లో మొత్తం తొమ్మిది జీవోలు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో ధర్మాన పాత్ర కూడా ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది.
సీబీఐ చార్జ్ షీట్ లో తన పేరు నమోదు చేయడంపై ధర్మాన స్పందించారు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపిన ధర్మాన రాజీనామాకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. అయితే చార్జ్ షీట్ పూర్తి వివరాలు తెలిసే వరకు వేచి ఉండమని ధర్మానను ముఖ్యమంత్రి కోరినట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
వాన్ పిక్ కేసులో మరో మంత్రి పేరు తెరమీదకు రావడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధర్మాన రాజీనామా ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందోనని అగ్రనేతలు కలవరపడుతున్నారు.
No comments:
Post a Comment