Tuesday, February 7, 2012

కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీలో పట్టుదొరికింది???


ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీలో పట్టుదొరికింది. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ విషయంలో విఫల మయినప్పటికీ, మిగిలిన అన్ని అంశాల్లోనూ కిరణ్‌ సూచనలను అధిష్ఠానం గౌరవించింది. ఫలితంగా.. తాజా స్వల్ప మంత్రివర్గ విస్తరణలో కిరణ్‌ తన వారిని నియమించుకోగలిగారు. అదే సమ యంలో శాసనసభకు సంబంధించి చీఫ్‌ విప్‌, విప్‌లను కూడా తన వర్గీయులనే నియమించుకోవడం ద్వారా ఢిల్లీలో తన పలుకుబడి పెరిగిందన్న సంకేతాలిచ్చారు.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించాలని సోనియా, పటేల్‌, ఆజాద్‌ వద్ద ఎంత ప్రయత్నించినా అవి నెరవేరలేదు. దానితో మళ్లీ నిరాశ చెందవలసి వచ్చింది.
 కిరణ్‌.. మంత్రివర్గం, శాసనసభకు సంబంధించిన మూడు పదవులనూ తన వారిని ఇప్పించుకునేందుకు చేసిన లాబీ ఫలించింది. కిరణ్‌కు ఆ విషయంలో నాయకత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా క్యాబినెట్‌లో తన వర్గీయులు ఉండాలన్న కిరణ్‌ కోరిక ఫలించినట్టయింది. ముగ్గురు మంత్రులు, ఒక చీఫ్‌ విప్‌, ఇద్దరు విప్‌ల నియామకాల్లో పూర్తిగా కిరణ్‌ మాటే చెల్లుబాటు కావడంతో ఢిల్లీ నాయకత్వం ఆయనకు దన్నుగా నిలిచిందని స్పష్టమవుతోంది. బడ్జెట్‌ సమావేశాల తర్వాత పూర్తి స్థాయి విస్తరణకు అనుమతిస్తామని హామీ ఇవ్వడం కూడా కిరణ్‌కు కలసివచ్చే అంశమే. ఉప ఎన్నికలు ఉన్నందున ఈ సమయంలో విస్తరణ మంచిదికాదని వారించారు. తెలంగాణలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్న కిరణ్‌ సూచనకు ఆమోదం తెలిపింది.
ఆ ప్రకారంగా… కిరణ్‌ తనకు సన్నిహిత మిత్రుడయిన కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవి ఇప్పించగలిగారు. నిజానికి కెప్టెన్‌ కోసం ఆయన ప్రతిసారీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉత్తమ్‌కు స్పీకర్‌, చీఫ్‌ విప్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఇప్పించేందుకు కిరణ్‌ శతవిధాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరకు తన మిత్రుడికి క్యాబినెట్‌లో చోటు ఇప్పించుకోగలిగారు. అధిష్ఠానానికి సైతం ఉత్తమ్‌ సేవలు తెలియడంతో ఆయన నియామకానికి మార్గం సుగమం అయింది.
ఇక తనకు నమ్మకస్తుడిగా ఉన్న కొండ్రు మురళికి మంత్రి పదవి ఇప్పించుకోవడంలో కిరణ్‌ విజయం సాధించారు. ఇటీవలి కాలంలో చురుకుగా పనిచేస్తున్న కొండ్రుకు మాల సామాజికవర్గంతో పాటు విధేయత అక్కరకువచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్‌ విగ్రహాల విధ్వంసం తర్వాత, అసంతృప్తితో ఉన్న మాలలను కొండ్రుకు మంత్రి పదవి ఇప్పించడం ద్వారా బుజ్జగించగలిగారు. ఇటీవలి కాలంలో కొండ్రు సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వికారాబాద్‌ ఎమ్మెల్యే ప్రసాదరావు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోటానే కావడం గమనార్హం. నిజానికి ఆయన పేరు కొద్దిరోజుల నుంచే తెరపైకి వచ్చింది. చురుకుగా వ్యవహరించే మాదిగ వర్గానికి చెందిన ప్రసాదరావును తీసుకోవడం ద్వారా.. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు చెక్‌ పెట్టే వ్యూహానికి తెరలేపారు. తాజాగా ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించగా, అందులో ఇద్దరు దళితులు ఉండటంతో కిరణ్‌ సర్కారు దళితులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతాలు పంపించగలిగారు.
ఇక తనకు కంట్లో నలుసులా మారిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డికి ఉన్న వైద్య, విద్య, ఆరోగ్యను రెండుగా విభజించి డీఎల్‌ను దెబ్బకొట్టారు. దానిలో కీలకమైన వైద్య, విద్య, 104, 108 సర్వీసును ను తనకు విశ్వసనీయుడయిన కొండ్రు మురళీకి కట్టబెట్టి అందరినీ విస్మయపరిచారు. బొత్సను దెబ్బకొట్టేందుకు కాపు నేత కన్నాకు వ్యవసాయశాఖతో ప్రమోషన్‌ ఇచ్చారు. ఫలితంగా, ఇప్పటివరకూ ఆ శాఖ నిర్వహిస్తోన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు చెక్‌ పెట్టారు. కీలకమైన హౌసింగ్‌ను తన మిత్రుడయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. ఇదిలాఉండగా.. శాసనసభకు సంబంధించిన నియామకాల్లోనూ కిరణ్‌ చక్రం తిప్పారు. చీఫ్‌ విప్‌గా తనకు విశ్వసనీయుడయిన గండ్ర వెంకటరమణారెడ్డిని నియమించనున్నారు. మంత్రి పదవి కోసం చివరి వరకూ ప్రయత్నించిన గండ్రను సంతృప్తి పరిచేందుకు ఆయన చీఫ్‌ విప్‌ కట్టబెట్టనున్నారు.
విప్‌లుగా తనకు అనుకూలురయిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, పీఆర్పీకి చెందిన బాల్కొండ ఎమ్మెల్యే అనిల్‌కు అవకాశం కల్పించనున్నారు. నిజానికి, అనిల్‌ చాలాకాలం నుంచి కిరణ్‌ శిబిరంలోనే ఉన్నారు. చిరంజీవి పీఆర్పీ నుంచి కేవలం ఇద్దరికే మంత్రి పదవులు సిఫారసు చేశారని, తెలంగాణ నుంచి ఎవరికీ సిఫారసు చేయలేదని తెలుసుకున్న వెంటనే అనిల్‌, ముఖ్యమంత్రి వైపు మొగ్గుచూపారు. నాటి నుంచీ ఆయనకు విధేయుడిగా ఉండటంతో విప్‌ పదవి ఆయనను వరించనుంది. అనిల్‌కు విప్‌ వస్తుందని చాలారోజుల నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ, మళ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలో జగన్‌ వర్గీయులు వ్యతిరేకంగా ఓటు వేస్తే ప్రమాదమని గ్రహించారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి భట్టికి చెప్పి నచ్చచెప్పినట్లు సమాచారం.
కొత్త మంత్రుల బయోడేటాలు
రాష్ట్ర మంత్రులుగా కొండ్రుమురళీ మోహన్‌, కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌ 06/02/2012 తెది సోమవారం ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కూడా 50 ఏళ్ల లోపువారే కావడం విశేషం. వారి జీవిత విశేషాలు ఇలా ఉన్నాయి.
కొండ్రు మురళి : శ్రీకాకుళం జిల్లా లావేటిపాలెంలో 1969 జూలై 8 న జన్మించారు. తండ్రి పేరు కె అప్పారావు. బిఇ, ఎంబీఎ చదివిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. రాజాం నుంచి 2004 ఎన్నికల్లో తొలిసారిగా ఎచ్చెర్ల నియోజగవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి 2009 లో అదే జిల్లా రాజాం నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ ఎన్నికల్లో సీనియర్‌ తెదేపా నాయకురాలు, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా పని చేసిన కె ప్రతిభా భారతిని ఓడించడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పడు ఆయనను ప్రభుత్వ విప్‌గా నియమించారు.
ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి: నల్గొండ జిల్లా సూర్యపేటలో 1962 జూన్‌ 20 న జన్మించారు. తండ్రి పేరు పురుషోత్తమరెడ్డి. బిఎస్‌సి డిగ్రీతో పాటు రక్షణ శాఖలో పలు పీజీ కోర్సులను చేశారు. ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలెట్‌గా పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత వ్యవసాయం వృత్తిగా స్వీకరించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకు ముందు కోదాడ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో హూజూర్‌నగర్‌ నుంచి గెలుపొందారు. ఎపి ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ సెల్‌ చైర్మన్‌గా పని చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

గడ్డం ప్రసాద్‌కుమార్‌ : రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండల కేంద్రానికి చెందిన వారు. వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిఎ వరకు చదివారు. ఆయనకు భార్య శైలజ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి పేరు జి ఎల్లయ్య. చిన్నప్పటి నుంచి దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

No comments:

Post a Comment