Monday, July 30, 2012

రైలు ప్రమాదమా? విద్రోహచర్యా?


నెల్లూరు సమీపంలో జరిగిన రైలు దుర్ఘటన ప్రమాదమా? విద్రోహుల ఘాతుకమా? సాక్షులు చెప్తున్న కథనంతో ఈ సందేహాలు కలుగుతున్నాయి. కుట్ర కోణంపైనా ఉన్నతాధికారులు దృష్టిసారించారి. పూర్తిస్థాయి విచారణలో నిజాలు బయటకొస్తాయని చెప్తున్నారు.ఈ మంటలు ప్రమాదం కారణంగానే ఎగిసిపడుతున్నాయా? ఇది ప్రమాదం మాటున సంఘ విద్రోహ శక్తులు ఆడిన నెత్తుటి క్రీడా?
తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైందనే తొలుత అందరూ భావించారు. కానీ.. కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్నికీలలు ఎగిసిపడే ముందు పేలుడు శబ్దాలు వినిపించాయని ప్రయాణికులు చెప్తుండడంతో కొత్త సందేహాలు తలెత్తాయి. ఈ దుర్ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలిచ్చారు. ప్రయాణికులిచ్చిన సమాచారమే కీలకంగా మారింది. పేలుడు ఎలా సంభవించిందనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. S-11లో ముగ్గురు అనుమానితులు సంచరించినట్టు కొందరు చెప్తున్నారు. దీంతో.. అన్‌రిజర్వ్డ్‌ ప్రయాణికులపై టీటీలను విచారణ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.నెల్లూరు రైల్వే స్టేషన్ వరకు అంతా సవ్యంగానే ఉన్నా.. కొన్ని నిమిషాల వ్యవధిలో ఇంత పెద్ద ప్రమాదం ఎలా సంభవించిందన్నది మిస్టరీగా మారింది.
నెల్లూరులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ -చైన్నై తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైల్లో తెల్లవారుజామున సుమారు 4.45గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి రైలు బయలుదేరిన కొద్ది సేపట్లోనే ఎస్-11 బోగీలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు ఏమి జరుగుతోందో తెలుసుకునే లోగా మంటలు వేగంగా విస్తరించడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నారు.
ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. 20మంది ప్రయాణికులు ఒక డోర్ ఓపెన్ చేసుకుని దిగిపోయారని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. మంటలు ఇంతర బోగీలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది గ్యాస్  కట్టర్ సాయంతో బోగీని రైలు నుంచి వేరు చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
విద్యుదాఘాతంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రమాద సమయంలో బోగీలో 72మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతున్నందున  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పది మంది క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ సైతం ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
అటు రైలులో మంటలు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బోగీలో ఉన్న 15మంది ప్రయాణికులు బయటకు దూకారు. వీరిలో ఒకరు మృతి చెందగా మిగతా వారిని చికిత్స నిమిత్తం జైభారత్ ఆస్పత్రికి తరలించారు. రైలు ప్రమాదంలో గాయపడిన 22మందిని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో చెన్నైకు చెందిన బన్సల్, సరళ, ఖమ్మంకు చెందిన శ్రీనివాస్, ఉదయభాస్కర్ గా గుర్తించారు. వీరిలో సరళ, బన్సల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్వో సాంబశివరావు తెలిపారు.
 రైలు బోగీని పరీక్షించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన బోగీ నుంచి 15మంది వరకు సురక్షితంగా బయటపడ్డారని నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ప్రమాద సమయంలో రైలు సుమారు 120కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరోవైపు ప్రమాదస్థలిలో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. దగ్గర్లోనే ఫైర్ స్టేషన్ ఉండటంతో భారీ ప్రమాదం జరగకుండా నివారించగలిగామన్నారు. మొత్తం 14మంది బయటపడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఇంకా ఎక్కువగానే సురక్షితంగా బయటపడి ఉంటారని ఆయన చెప్పారు. 
తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది. నెల్లూరు హెల్ప్ లైన్ నెంబర్లు - 0861-2345863, 2345864, 2345865,2345866. విజయవాడ హెల్ప్ లైన్ నంబర్లు -0866-2576924,2575038. సికింద్రాబాద్ 040-27786723, 27700868. కాగా మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున రైల్వేశాఖ పరిహారం ప్రకటించింది. 
 ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: సహాయక చర్యలకు ఆదేశం
 రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించాలని నెల్లూరు కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ వైద్యబృందాలు, అంబులెన్సులు ఘటనాస్థలం దగ్గర ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

No comments:

Post a Comment