Saturday, November 26, 2011

రాష్ట్ర ప్రజలకు వరాలు! ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నేడు ముఖ్యమంత్రి తాయిలాలు


ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కొత్త వరాలను ప్రకటించేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించనున్న ‘రచ్చబండ’ వేదికగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త వరాలను ప్రకటించనున్నారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాద్‌నగర్ బయలు దేరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి ఎటువంటి వరాలను ప్రకటిస్తారన్నది ఆయన మంత్రివర్గ సహచరులకు కూడా అంతు చిక్కడం లేదు. మహిళలకు జీరో వడ్డీపై రుణాలు ఇచ్చే పధకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. డ్వాక్రా మహిళలకు ప్రస్తుతం పావలా వడ్డీపై రుణాలు ఇస్తుండగా దాన్ని జీరో వడ్డీ చేయాలన్న అభిప్రాయంతో ఉన్నారు. పేద ప్రజలకు వంద రూపాయలకే నిత్యావసర సరుకుల ప్యాకేజి కూడా ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్యాకేజి గురించి ముఖ్యమంత్రి ఇంతకు ముందే ప్రకటించారు. ‘ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎవరూ ఊహించని విధంగా ముఖ్యమంత్రి కొన్ని వరాలను ప్రకటించనున్నారు’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన నాయకుడు ఒకరు చెప్పారు. అయితే అవేటిమన్నది వివరించడానికి ఆయన నిరాకరించారు. ముఖ్యమంత్రే ప్రకటిస్తారు కదా, చూస్తూండండి’ అని ఆయన అన్నారు.
ప్రతి నెలా ఒక్కో కొత్త పథకాన్ని ప్రకటించాలన్నది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయం. ప్రధానంగా మహిళలకు ఒక ప్రత్యేక పథకం గురించి ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించాలా లేక ఇప్పుడే ప్రకటించాలా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించినట్లయితే ఓట్ల కోసమే ప్రకటించారన్న అనుమానం కలగవచ్చని, ముందుగానే ప్రకటించి అమలు చేసినట్లయితే మహిళలను ఆకర్షించుకోవచ్చన్న అభిప్రాయం కూడా ఉంది. ‘ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడింది, పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రకటించేందుకు అవకాశం ఏర్పడింది’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీవ్ యువ కిరణాలు, రూపాయికే కిలో బియ్యం పథకం, ఇందిర జల ప్రభ వంటి పథకాలను కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా ప్రకటించబోయే పథకం ఎలా ఉంటుంది, ఎవరిని ఉద్దేశించింది అన్నది ఆసక్తిగా మారింది. ఇలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో షాద్‌నగర్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. 5.96 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 34.31 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన వివిధ పనులను ప్రారంభిస్తారు. అనంతరం షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

సొంత పార్టీ నేతలే కిషన్ జీ ఎన్‌కౌంటర్‌కి కారణమా?

సొంత పార్టీ నేతలే కిషన్ జీ 

ఎన్‌కౌంటర్‌కి కారణమా?


మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌కు, అసోం వేర్పాటువాద సంస్థ ఉల్ఫాకు సంబంధం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే సొంత పార్టీ నేతలే కిషన్ జీ  మరణానికి కారణం అయ్యారనే సందేహాలు వున్నాయి .దక్షిణ, ఉత్తర భారతాన్నంతా ఏదో మేరకు ప్రభావితం చేయగలుగుతున్న మావోయిస్టు పార్టీకి 'ఈశాన్యం' కొరకరాని కొయ్యగా మారింది.  ఈ నేపధ్యం లో అసోంలో పాగా వేసేందుకు గత పది, పదిహేనేళ్లుగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది . బెంగాల్ సరిహద్దుల్లో ఉండటం, భద్రతా బలగాల దాడుల తాకిడి తక్కువగా ఉండి షెల్టర్‌కు అనువుగా ఉండటం వల్ల కూడా అసోంపై కన్నేశారు. దీనికోసం ఉల్ఫాతో చాలాకాలంగా చర్చలు జరుపుతున్నారు.  ఈ చర్చల కోసం 2008లో కిషన్‌జీ బంగ్లాదేశ్ వెళ్లి బారువాను కలుసుకున్నారు. మావోయిస్టులకు అవసరమైన మౌలికమైన వనరులకు సంబంధించిన మద్దతు ఇవ్వటానికి అంగీకరిస్తూనే.. 'దాడుల' ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చారు. దీంతో ఇకపై ఉల్ఫాతో చర్చలకు వెళ్లరాదని మావోయిస్టులు నిర్ణయించారు. అసోంలో స్వయంగానే ఎదిగే ప్రయత్నం చేశారు. అప్పర్ అసోం లీడింగ్ కమిటీ (యూఏఎల్‌సీ) అనే సంఘం పెట్టి.. విస్తరణ వ్యూహాలను అమలు చేశారు. రిక్రూట్‌మెంట్, విరాళాల సేకరణపై దృష్టి సారించారు. ప్రస్తుతం వంద మందికిపైగా అసోమీలు మావోయిస్టు పార్టీలో చేరినట్టు సమాచారం. "అసోం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మావోయిస్టుల శిక్షణా శిబిరాలు ఉన్నాయి. సాదియా, తిన్‌సూకియా జిల్లాలో వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఒక్కప్పుడు ఇవి ఉల్ఫాకు పెట్టని కోటలు. తమ ప్రాంతంలోకి మావోయిస్టులు రావటంపై స్థానిక ఉల్ఫా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారుఅయితే, ఒక్క ఉల్ఫాయే కాదు, పోలీసులు, సైన్యం కూడా 'మావోయిస్టు' ప్రమాదాన్ని గుర్తించి  నిఘాను పెంచి గాలింపు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు దొరకలేదు గానీ, ఉల్ఫాకు చెందిన కార్యకర్తలు మరణించారు. దీంతో  బారువా కలవరపడ్డారు. మావోయిస్టులను అసోం నుంచి తరిమేయాలని నెల క్రితం ఆయన తన కేడర్‌కు ఆదేశాలు జారీ చేశారని, దీని కోసం ఉల్ఫా కొన్ని దళాలను కూడా ఏర్పాటు చేసిందని నిఘా వర్గాల సమాచారం . పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న కిషన్‌జీ ఈ దశలోనే అసోంలో అడుగు పెట్టారు . బెంగాల్‌లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టు కోటను కూల్చివేయడంతో కీలక పాత్ర  పోషించిన ఆయనకు..'అసోం' టాస్క్ అప్పగించారని తెలుస్తోంది. అలా అసోం చేరాడు  అనుకున్న కిషన్‌జీ గురువారం బెంగాల్‌లోని జంగల్‌మహల్‌లో శవమై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అసోంలోనే పట్టుకొని, బెంగాల్‌లో కాల్చి చంపి ఉంటారన్న అనుమానాన్ని సానుభూతిపరులు వ్యక్తం చేస్తున్నారు. కాగా బెంగాల్ కమిటీలో కిషన్‌జీ తీరు నచ్చని నేతలే బలగాలకు ఉప్పందించారనే   పుకార్లు  కూడా  వున్నాయి .అధికార వర్గాలు చెబుతున్నాయి. "అసంతృప్త నేతల నుంచి కిషన్‌జీ ఆనుపానులను భద్రతా బలగాలు తెలుసుకుని   ఉచ్చు బిగించి, కిషన్‌జీని ఎన్‌కౌంటర్‌లో అంతం చేశాయి'' అనే వాదనలు విన్పిస్తున్నాయి.

Thursday, November 24, 2011

ఏడాది కిరణం


ఏడాది కిరణం
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉరికిస్తున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన ఏడాది దిశగా అడుగుల వేస్తున్నది. ఈ నెల 25తో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కానుండడంతో ఇటు ప్రభుత్వం అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంది. వైఎస్‌ ఆకస్మిక మరణంతో ఇటు ప్రభుత్వం, అటు పార్టీ ల్లోనూ తీవ్ర సంక్షోభం నెలకుంది. అంతేకాకుండా ప్రత్యేక వాద ఉద్యమాలు ఉవ్వెత్తిన వెగిసిపడ్డాయి. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా సంక్షోభ కోరల్లో చిక్కుకొంది. అనంతరం 14 నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజెటి బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాష్ట్రంలో పరిస్థి తులు చక్కబడలేదు.
ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో గతంలో మంత్రిగా ఎటువంటి అనుభవం లేకపోయి నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనదైన మార్క్‌ పాలన తో నల్లారి ఏడాది పాలనకు చేరువకావడం ఆయన మంత్రివర్గ సహచరుల సైతం నమ్మశక్యం కావడం లేదు. కేబినెట్‌లో ఒకరిద్దరు తప్ప మెజారిటీ మంత్రులు నల్లారిపాలనకు బ్రహ్మరథం పడుతూ ఆయనపై పూర్వి విశ్వాసం ఉంచడం గమనార్హం. వచ్చే ఎన్నిక ల్లోనూ నల్లారి సారథ్యంలో తమ పార్టీ ముందుకు పోతోందని మెజారిటీ మంత్రులు అభిప్రాయ పడుతున్నారు. వైఎస్‌ సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్రవేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలన సంస్కరణలకు అన్ని స్థాయిల్లో పదును పెడుతూ, మరోవైపు ఖాళీ ఖజానాను తిరిగి పట్టాలెక్కించడం బాగా కలిసివచ్చిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా గ్రీన్‌ఛానల్‌ విధానాన్ని తెరమీదకు తెచ్చి, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎటువంటి నిధుల సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పన్నుల వాత కాస్త ఎక్కువైనప్పటికీ.. మెజారిటీ ప్రజల ఆంక్షాలు నెరవేర్చే దిశగా నల్లారి సర్కార్‌ సంక్షేం దిశగా పరుగులెట్టింది.
రచ్చబండతో ప్రజలకు మరింత చేరువగా…
ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రజలకు నల్లారి మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో వైఎస్‌ ఇమేజ్‌ను కూడా నల్లారి క్రాస్‌ చేశారని ఆయన కేబినెట్‌ సీనియర్‌ మంత్రులు చెబుతున్నారు. లక్ష 16 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, రాజీవ్‌ యువ కిరణాల పేరుతో ప్రైవేట్‌రంగంలో వచ్చే మూడేళ్లల్లో 15 లక్షల ఉద్యోగాల రూపకల్పన నల్లారి ఇమేజ్‌ పెంచింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఈ పథకం ఎంతగానో ఆకట్టుకొన్నది. అదే విధంగా రూపాయికే కిలో బియ్యం పథకం పేద ప్రజలకు ఎంతో ఊరట నిచ్చింది. రెండోవ దశ రచ్చబండతో 35 లక్షల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, సామాజిక ఫించన్లు తదితర పథకాలు నల్లారి పాలనా సుస్థిరతకు ఎంతోగానో తోడ్పడినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చెబుతున్నారు.

Monday, November 21, 2011

సీబీఐ విచారణపై చంద్రబాబు బ్లాక్‌మెయిలింగ్!!!


 సీబీఐ విచారణపై చంద్రబాబు బ్లాక్‌మెయిలింగ్!!!



 క్రమ ఆస్తులపై సీబీఐ విచారణ నిర్వహిస్తే అవిశ్వాస తీర్మానం పెడతామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు భూపతిరాజు శ్రీనివాసరాజు గాజువాక 61వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని 21-11-2011ఆదివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో రోజా ప్రసంగించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారన్నారు. అందువల్ల అవిశ్వాసం పెట్టాలంటే ఆయన అరికాళ్లకు చెమట్లు పడుతున్నాయన్నారు. అధికారంలోకి రాలేమని తెలిసే చంద్రబాబునాయుడు అవిశ్వాసానికి ముందుకు రావడం లేదన్నారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. 
గతంలో పదవుల కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి చుట్టూ తిరిగిన నేతలు ఆయన మరణానంతరం రోశయ్య చుట్టూ, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టూ తిరుగుతున్నారన్నారు. వైఎస్ బతికున్న కాలంలో వానపాముల్లా ఉండే కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇప్పుడు నాగుపాముల్లా బుస కొడుతున్నారన్నారు. వారు బుస కొట్టడానికి తప్ప దేనికీ పనికి రారన్నారు. ఎందరు నాయకులు, పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. వైఎస్ ప్రతిష్టను చూసి ప్రజలు ఓట్లేశారు తప్ప, కిరణ్‌కుమార్‌రెడ్డిని, బొత్స సత్యనారాయణను చూసి కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏనాడూ రైతు సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుతం రైతు సమస్యలపై పగటి వేషగాడిలా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ మరణం తరువాత రాష్ట్రం చిన్నాభిన్నమైందన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ర్త అధ్యక్షురాలు నిర్మలా కుమారి మాట్లాడుతూ వైఎస్ మరణానంతరం రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. పార్టీ అర్బన్ కన్వీనర్ జి.వి.రవిరాజు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను దోచుకున్న చంద్రబాబునాయుడిపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో అతని గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. గాజువాక నియోజకవర్గ నేత తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, నాయకులు ఉరుకూటి అప్పారావు, చొప్పా నాగరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, అంగ అప్పలరాజు, వంశీకృష్ణ యాదవ్, చట్టి అప్పారావు (బాబు), నక్క వెంకట రమణ, పరదేశి, షౌకత్ అలీ, పల్లా చినతల్లి తదితరులు పాల్గొన్నారు.

Thursday, November 17, 2011

నిజాయితీని నిరూపిస్తాం


నిజాయితీని నిరూపిస్తాం
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ విజయమ్మ వేసిన పిటిషన్‌లో గతంలో ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆరోపించిన అంశాలే ఉన్నాయని తెలుగుదేశంపార్టీ పేర్కొంది. అనేక కేసులు విచారణకు అర్హత లేవని కోర్టులే తోసిపుచ్చాయని, అవే అంశాలతో మళ్ళీ కోర్టులో ఫిర్యాదు చేశారని ఆపార్టీ దుయ్యబట్టింది. విజయమ్మ పిటిషన్‌పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు సహజ న్యాయ సూత్రాలు కూడా పాటించకపోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ విచారం వ్యక్తంచేసింది.ప్రతివాదికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం, పిటిషన్‌ ఒకటైతే హైకోర్టు మరో ఆదేశం ఇచ్చిందని మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నాగేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రొచ్చులోకి దిగి, ఆ రొచ్చును ఇతరులపైకి చల్లే ప్రయత్నం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 1975 నుంచి చంద్రబాబుపై ఇవే ఆరోపణలు చేసి 18సార్లు కోర్టుల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహా అనేక మంది కాంగ్రెస్‌ నేతలు పిటిషన్లు వేశారని, వాటిని నిరూపించలేక కొన్ని ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని కోర్టులు కొట్టివేశాయని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుపై వేసిన పిటిషన్లు విచారణకు అనర్హమైనవని కోర్టులు తోసిపుచ్చాయని ఆయన చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ కేసులో కూడా గతంలో చేసిన ఆరోపణలపై పిటిషన్‌ వేసి ఎన్నికలు కాగానే ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. 1999, 2004 మధ్య ఐదేళ్ళపాటు ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థను కూడా చర్య తీసుకోమని కోరలేదంటూ ప్రతివాదులకు నోటీసులు ఇవ్వడానికి కూడా ఈ అంశాలకు అర్హత లేదని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టంచేసిందని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. హైకోర్టు తీర్పును ప్రశ్నించడం, కించపరచడం తమ ఉద్దేశం కాదని, కోర్టులను, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. అలాంటి వ్యక్తిని కూడా సిబిఐ విచారణ పరిధిలోకి తీసుకురావడం బాధాకరమన్నారు. తాము న్యాయ వ్యవస్థనుగానీ, సిబిఐగానీ ప్రశ్నించడం లేదని, విజయమ్మ పిటిషన్‌ ఆరోపణలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు గత చరిత్రను మరోసారి గుర్తు చేస్తున్నామని బొజ్జల అన్నారు. సింగపూర్‌లోని హోటల్‌ ఫోటోను ఇంటర్నెట్‌ నుంచి తెచ్చి చంద్రబాబు బినామీ ఆస్తి అని ఆరోపించారని, అయితే ఆ హోటల్‌ యాజమాన్యం గురించి కనీస ప్రస్తావన చేయలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. అమెరికాలో వైట్‌హౌస్‌ ఫోటో తెచ్చి అది కూడా చంద్రబాబు బినామీ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు.

Wednesday, November 16, 2011

ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు...


ధరలపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు – రచ్చబండలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
‘పేద కుటుంబాలు మూడు పూటలా కడుపునిండా అన్నం తినాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీని కోసమే రూపాయికి కిలో బియ్యం అమలుచేస్తున్నాం. కానీ మిగిలిన ధరలు భారీగా పెరిగిపోయినందున ఎలా కుటుంబాన్ని నెట్టుకురావాలన్నదే మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తున్న ప్రశ్న అని నాకు తెల్సు. అందుకే సంచలనాత్మకమైన రీతిలో ధరల నియంత్రణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి, మంత్రిని కూడా నియమించనున్నాం…’ పశ్చిమగోదావరి రచ్చబండలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన కీలకమైన ప్రకటన ఇది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో 15-11-2011తెది మంగళవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రూపాయికి కిలో బియ్యం పథకం ప్రయోజనాలు, విశిష్టతలను వివరిస్తూనే మిగిలిన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోందని అంగీకరించారు. పేదలకు ప్రయోజనకరంగా ధరలను నియంత్రించడానికి వీలుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించడానికి మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు తాము తీసుకున్న రుణం లక్ష రూపాయల వరకు ఏడాదిలోపే తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండబోదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ వడ్డీ భారాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. మరోవైపు మహిళలకు త్వరలోనే మంచి శుభవార్తను ప్రకటిస్తామన్నారు. ఈ సందర్భంగానే పావలా వడ్డీ రాయితీ అందరికి అందుతోందా అంటూ డ్వాక్రా మహిళలను ప్రశ్నించగా కొంతమంది వస్తోందని, మరికొందరు రావటం లేదని సమాధానాలు చెప్పటంతో పావలా వడ్డీ పథకంలో ఇదొక సమస్యగా మారిందని, ప్రభుత్వం కూడా గుర్తించిందని సిఎం చెప్పారు. దీనిని పరిష్కరించడానికి ఇకనుంచి నేరుగా గ్రామాల్లోని సంఘాలకు వడ్డీ రాయితీ జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేసమయంలో వేదికపై ఉన్న మంత్రి సునీతాలక్ష్మారెడ్డిని దీనికి సంబంధించి ఉత్తర్వులు వెంటనే వెలువడేలా చూడాలని ఆదేశించారు. దీంతో మహిళలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు.
రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చెప్పారు. ధాన్యానికి మద్దతుధర విషయంలో అదనంగా 120 రూపాయల బోనస్ చెల్లించాలని ఇప్పటికే ప్రధానమంత్రిని కోరామన్నారు. మత్స్య, పౌల్ట్రీల నుండి నాలా ఛార్జీలు వసూలు చేసే పద్ధతికి స్వస్తి పలకనున్నట్లు సిఎం ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో పెద్దఎత్తున సాగుతున్న చేపలు, రొయ్యల ఎగుమతులను మరింత ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతురుణాలపై అమలుచేస్తున్న ఏడు శాతం వడ్డీ రేటును మహిళా గ్రూపులకు కూడా అమలుచేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. పావలా వడ్డీ కంటే తక్కువకే మహిళా సంఘాలకు రుణాలు అందించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొల్లేరు అభయారణ్య పరిధిని అయిదవ కాంటూరు నుంచి మూడవ కాంటూరుకు తగ్గించడానికి ప్రభుత్వం తరపున ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సిఎం వరాల జల్లు కురిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, పితాని సత్యనారాయణ, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు కావూరి సాంబశివరావు, కనుమూరి బాపిరాజు, ఉండవల్లి అరుణకుమార్, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానితోపాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన ప్రారంభం
గర్భిణీలను ఆదుకోవడానికి కేంద్రం ప్రకటించిన ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజనను రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఏలూరులో ఇందుకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో 56వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చడానికి ఏడున్నర కోట్ల రూపాయలను ఆయన విడుదల చేశారు. అంతకుముందు దాదాపు 125 కోట్ల రూపాయలతో ఏలూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

పెట్రోలు ధ‌ర త‌గ్గిందోచ్‌..


పెట్రోలు ధ‌ర త‌గ్గిందోచ్‌..
పెరుగుట తప్ప తరుగుట ఎరుంగని పెట్రోలు ధర తగ్గింది. ఔనా.. నిజమేనా!? అని ఆశ్చర్యపోయి నా.. పెరుగుట తరుగుట కొరకే అని మీరు అనుకున్నా ఇది నిజం. చమురు కంపెనీలు పెట్రోలు ధర లీటరుకు రూ.1.85 తగ్గించాయి. స్థానిక పన్నులను కూడా కలుపుకొంటే వాహనదారుడికి సుమారు రూ.2.40 వరకు ఉపశమనం కలగనుంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ తగ్గింపు అమల్లోకి రానుంది. దాదాపు మూడేళ్లలో పె ట్రోలు ధరలు తగ్గడం ఇదే తొలిసారి. లీటరుకు రూ.1.85 తగ్గించడంతో స్థానిక పన్నులు కూడా కలుపుకొని ఢిల్లీలో పెట్రోలు రూ.2.22 తగ్గింది. ముంబైలో 2.34; కోల్‌కతాలో 2.31; చెన్నైలో 2.35 తగ్గింది. అంతర్జాతీయంగా ధరలు త గ్గడం కారణంగా గతంలో ధరలను సవరించినప్పటి నుంచి లీటరు పెట్రోలుకు మాకు రూ.1.85 లాభం వచ్చిందని, ఆ లాభాన్ని వినియోగదారులకు అందించాలని భావిస్తున్నామని ఇండియన్ ఆయి ల్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ఎస్ బుటోలా చెప్పారు.

చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారా..?


చిరంజీవి కేంద్రమంత్రి కాబోతున్నారా..?
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఖాయమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డంఖా భజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చిరంజీవికి అధిష్టానం కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల అది నెరవేరడంలో జాప్యం జరుగుతోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడుగా ఉన్న బొత్సను ఎవరైనా ప్రశ్నిస్తే చిరంజీవి కేంద్ర మంత్రి అవడం ఖాయం.అది కూడా మరి కొద్ద నెలలలోనే అని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. అలా ఎలా చెప్పగలుగుతున్నారని అడిగితే అది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం . కావాలంటే వేచి చూడండి అని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాజ్య సభ ఎన్నికలలో చిరంజీవికి టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే అంతకుముందే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని బొత్స అభిప్రాయ పడుతున్నారు.మంత్రి పదవిలోకి వచ్చాక ఆరు నెలలలోగా పార్లమెంటుకు ఎన్నికైతే సరిపోతుంది కనుక ఇబ్బంది ఉండదని అంటున్నారు. చిరంజీవి మా పార్టీ నాయకుడు అని బొత్స సంతోషంగా చెబుతున్నారు. అయితే ఈ మద్య చిరంజీవి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా చేస్తానని అనడంతో రకరకాల ప్రచారాలు వచ్చాయి. ఆయన రాష్ట్ర పదవితోనే సరిపెట్టుకొంటారేమోనన్న భావన కలిగింది. కాని ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు బొత్స చెబుతున్న మాటలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ఎంతకాలంలో చిరంజీవి కేంద్ర మంత్రి అయి ఆయన అభిమానులను అలరిస్తారో చూడాలి.

Sunday, November 13, 2011

మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు



మన్మోహన్ ప్రకటనపై కేసీఆర్ మండిపాటు
కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు ?
 తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మన్మోహన్  చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ ప్రజలకు 'భయపడకండి.. నేనున్నాను' అంటూ అభయమిచ్చారు. . ఆయనకు ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్య విలువలపై గౌరవం లేదని మండిపట్టారు.
తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని కళ్లుండీ చూడలేని కబోధి ప్రధాని మన్మోహన్ అని దుయ్యబట్టారు. 'తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తుంది.. ఇదే నా శాపం' అంటూ దని శాపనార్థాలు పెట్టారు. 'తెలంగాణ ప్రజలారా బాధపడకండి, భయపడకండి ...మీతో నేనున్నాను.. అన్ని రకాల పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకుందాం' అంటూ కేసీఆర్ ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రజల కోపాగ్నికి కాంగ్రెస్ రుచి చూస్తుంది. 
బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు: ఈటెల 
ప్రధాని మన్మోహన్‌సింగ్ బాద్యతారాహిత్యంగా మాట్లాడారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎంపీలో తెలంగాణ అంశాన్ని చేర్చడంతో పాటు పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించారు. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు.. అన్ని వర్గాల ప్రజల మనోభావాలను ప్రధాని గౌరవించాలి. తెలంగాణకు అనుకూలంగా దేశ వ్యాప్తంగా 28 పార్టీల లేఖలను ప్రధానికి అందించాం.ఇప్పుడు దానిని పక్కనపెట్టి అన్ని పార్టీలను కన్సల్ట్ చేయాలని మాట్లాడడం తగదు..నిర్ణయం ప్రకటించాల్సిన కాంగ్రెస్ దొంగదారులు వెతుకుతోంది..తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతత, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసమే అడుగుతున్నారు. జాతీయ సమస్య అని ప్రధాని ఇప్పుడు అంటున్నారు.. 14 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఏమైంది..అన్ని రాష్ట్రాలు ఆత్మగౌరం వల్ల చేసిన ఉద్యమాల ఫలితంగానే ఏర్పడ్డాయి. చరిత్రను ప్రధాని అవలోకనం చేసుకోవాలి.. 
చావు కబురు చల్లగా చెప్పినట్టుంది: యాష్కీ
ప్రధాని వ్యాఖ్యలు చావు కబురు చల్లగా చెప్పినట్టుంది.. దీనిని పూర్తిగా విభేధిస్తున్నాం... ఇదే నిజమన్న భయాందోళన మాలో ఉంది.. ఇదే యూపీఏ ప్రభుత్వ నిర్ణయమని అనుకుంటున్నాం. తెలంగాణను అడ్డుకునే లగడపాటి రాజ్‌గోపాల్, కేవీపీ రామచంద్రరావులు ఇలాంటి ప్రకటనలే వస్తాయని గత రాత్రి నుంచే అంటున్నారు. అదే వాస్తమౌతోంది. తెలంగాణ వాదులంతా ఈ సమయంలో ఏకమవ్వాలి..యూపీఏ నిర్ణయం కూడా ప్రధాని చెప్పనట్టే ఉంటుంది.. ఈ విషయంలో టీడీపీ కూడా కుమ్మక్కయింది. 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతానని చంద్రబాబు అభయమిచ్చాడు.. దానికి కేంద్రం కూడా తలొగ్గింది.. ప్రజల అభిప్రాయానికి ఏ ప్రభుత్వమైనా తలొంచాల్సిందే.. లేదంటే దిగిపోవాలి..ప్రధాని వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆదివారం సమావేశమవుతుంది. ఇందులో కెకె , జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులతో చర్చిస్తాం.. ఏమి చేయాలన్న దానిపై అందులో నిర్ణయిస్తాం. యూపీఏకు తెలంగాణ ఇచ్చే ఉద్దేశం లేదు. 
కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలి: హరీశ్
ప్రధాని ప్రకటన పూర్తి బాధ్యతా రాహిత్యం... తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేసి వెంటనే బయటకు రావాలి, రోజుకో ప్రకటన చేస్తూ ఆపార్టీ తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోంది. తెలంగాణ ప్రజల ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఒకలా... అవసరం తీరాక మరోలా మాట్లాడితే ఎలా? 
తెలంగాణ ఇవ్వలేమని చెప్పలేదు: వినోద్
ప్రధాని కొత్తగా మాట్లాడిందేమి లేదు. ఐదు నెలల క్రితం యూపీ పీసీసీ సోనియా, రాహుల్ సమక్షంలో ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తీర్మానించారు. ..అలాగే తెలంగాణ కూడా ఇస్తారని అన్నారు. అయితే ఇదంతా రెండో ఎస్సార్సీనా..లేక నేరుగా ఇస్తారా.. అన్నది వేచి చూడాలి. తెలంగాణను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలే నష్టపోతారు. ప్రధాని తెలంగాణ ఇవ్వలేమని స్పష్టం చేయలేదు...కష్టమని చెప్పలేదు. 
కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేయండి : ఎర్రబెల్లి
తెలంగాణ ఇస్తామన్న కాంగ్రెస్, తెస్తామన్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ప్రధాని ప్రకటనతో కాంగ్రెస్ నిజస్వరూపాన్ని బయటపెట్టారు. పదే పదే మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలి. ఈ మోసానికి శిక్షగా ప్రభుత్వాలను కూల్చాలి. 
రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు: కోదండ
పార్లమెంటులో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకుండా రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారు. పూటకో మాట మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచారు. కాంగ్రెస్ కో ఖతం కరో.. తెలంగాణకో హాసిలో కరో నినాదాన్ని చేపడతాం. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎటు వైపో తేల్చుకోవాలి. 


ఖండిస్తున్నాం: గద్దర్, విమలక్క, సూర్యం
ప్రధాన మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మరోసారి నిలువెల్లా దగా చేసిందనడానికి మన్మోహన్ వ్యాఖ్యలు నిదర్శనం. కేవలం పోరాటాల ద్వారానే తెలంగాణ సాధ్యం, ప్రజలు అందుకు సిద్దపడాలని పిిలుపునిస్తున్నాం. 
విభజన వాదనలో పసలేకనే ప్రకటన : పరకాల
ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న వాదనలో పసలేదు. చిదంబరం లాంటి వారు వారి రాష్ట్రాల విభజనకు ఒప్పుకుంటారా? తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు కలిసి ఉండాలని కోరుకొంటున్నారు. అందుకే ప్రధాన మంత్రి ఈ ప్రకటన చేశారు

Friday, November 11, 2011

రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం


రాసాభాసగా మారిన విశాఖ రచ్చ బండ కార్యక్రమం









విశాఖలోని గాజువాకలో జరిగిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. గతంలో మొదటి విడత రచ్చబండ కార్యక్రమంలో ఆర్జీలు పెట్టుకున్న ప్రజలకు రేషన్ కార్డులు, ఫించన్లు, ఇందిరమ్మ గృహాలు ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని నినాదాలు చేశాయి. దీంతో స్సందించిన అధికారులు అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో సభ ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కొద్ది సేపటికే ఎమ్మెల్యే, మేయర్‌, కమిషనర్‌ల ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నం చేయటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

Wednesday, November 9, 2011

ప్రజలు కరెప్ట్ అయితే నాయకులు ఏం చేస్తారు..?: జయసుధ


సినిమా రంగం నుంచి అనుకోకుండా రాజకీయాల్లోకి ప్రవేశించి సికింద్రాబాద్‌ ఎం.ఎల్‌.ఎ.గా ఎన్నికయ్యారు నటి జయసుధ. అటు రాజకీయాల్లోనూ తన సేవ చేస్తూనే మరోవైపు తనకు లైఫ్‌ ఇచ్చిన సినిమా రంగాన్ని వదలనని చెబుతున్నారు. ప్రస్తుతం సినిమారంగంలో బిజీగా ఉన్నానంటున్న జయసుధ... రాజకీయాల గురించి చర్చించారు. ఆమె చెప్పిన పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం...

'ఇట్స్‌ మై లవ్‌స్టోరీ'లో మీ పాత్ర ఎలా ఉంటుంది? 
చాలా మంచి పాత్ర. ఇంటిలో తల్లి, బిడ్డ రిలేషన్స్‌ ఎలా ఉంటాయో సినిమాల్లోనూ అలాగే ఉన్నాయి. నిఖిత నా కుమార్తెగా నటించింది. కొన్ని సీన్స్‌ చేస్తున్నప్పుడు నా ఇంట్లో మా పెద్దబ్బాయితో మాట్లాడే సందర్భాలు గుర్తుకు వస్తున్నాయి. చాలా నాచురల్‌గా దర్శకుడు శ్రీధర్‌ తెరకెక్కించారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? 
రాజకీయాల్లో ఉండటం వల్ల కొన్ని తగ్గించాను. ఇది కాక.. 'సోలో' సినిమా చేశాను. బాలకృష్ణతో 'అధినాయకుడు' (ఇంకా పేరు పెట్టలేదు) చిత్రంలో నటించాను. తొలిసారిగా ఆయన కాంబినేషన్‌లో చేయడం చాలా థ్రిల్‌గా అనిపించింది. ఇందులో బాలకృష్ణ మూడు తరాలకు చెందిన మూడు పాత్రలు పోషించారు. అందులో మొదటితరం చెందిన పాత్రకు భార్యగా చేశాను. 

ఇప్పటి సినిమాలు మీకెలా అనిపిస్తున్నాయి? 
ఇప్పటి యూత్‌ మంచి సినిమాలు తీయాలి. చాలావరకు కొన్నిలిమిట్స్‌ వరకే పరిమితం అవుతున్నారు. ప్రేమ అనే కాన్సెప్ట్‌తో చాలా చిత్రాలు వచ్చాయి. రొటీన్‌గా ఉంటున్నాయి. ఇటీవలే 'నైనా' తెలుగులో ప్రేమఖైదీ చూశాను. ప్రేమికుల మధ్య సంబంధాలు ఇలాగ కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయాను. గొప్ప ప్రయత్నం. ఆడకపోయినా కంటెంట్‌, తీసే విధానం బాగుంది. 

మొన్నీమధ్య వచ్చిన 'సెవెన్త్‌ సెన్స్‌' గొప్పప్రయత్నం. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటువంటి కొత్తకొత్త చిత్రాలు రావాలి. చెప్పే విధానంలో కొత్తదనం ఉంటేనే ఆకట్టుకుంటుది. బొమ్మరిల్లు తీసుకుంటే.. అందులో ప్రేమలో రకరకాల షేడ్స్‌ ఉన్నాయి. ప్రేయసీప్రియులతోపాటు తల్లిదండ్రులతో ప్రేమ సంబంధాలు సరికొత్తగా ఉన్నాయి. అలా కొత్త ప్రయత్నాలు తెలుగులో ఇంకా రావాలి.

రాజకీయాల్లో మీరు ఏం నేర్చుకున్నారు? 
అబ్బో! రాజకీయాల్లో చాలా నేర్చుకున్నాను. రోజూ కొత్తకొత్త విషయాలు తెలుస్తాయి. ఎన్నో రకాల మీటింగ్స్‌, వ్యక్తుల్ని కలుస్తుంటాం. ట్రూ పొలిటిషన్‌ అవ్వాలంటే కనీసం 10 ఏళ్ళ సర్వీస్‌ ఉండాలి. అయినా రాజకీయాలు కావాలని నేను వెళ్ళి ఎవర్నీ అడగలేదు. వై.ఎస్‌.ఆర్‌. పిలిచి నీకు సోషల్‌ వర్క్‌ అంటే ఇష్టం కదా... ఇక్కడకు వచ్చి చేయమన్నారు.

'ఆరోగ్యశ్రీ' అప్పుడే మొదలైంది. దాని ద్వారా ఇంకా పేదలకు మరింత సేవ చేయాలని అనుకున్నాను. ప్రతీదీ అది కావాలి.. ఇది కావాలి.. అంటూ ప్రజలు బిచ్చగాళ్ళలా అడుక్కుతిన్నట్లు రాజకీయాలపై ఆధారపడం నాకు నచ్చలేదు. అందుకే ఏదో చేయాలని ఈ రంగంలోకి వచ్చాను.

మరి అనుకున్నది చేయగలిగారా? 
ఏమీ చేయలేమని తెలిసిపోయింది. ఏదో చేయాలని ట్రై చేస్తున్నాం.

అంటే...?!! 
ముందుగా ప్రజలు లైఫ్‌స్టైల్‌ మార్చుకోవాలి. అప్పుడే ఏదైనా చేయగలం. నా నియోజకవర్గంలో 65 బస్తీలున్నాయి. వాటిలో తిరుగుతుంటే... హైటెక్స్‌ అంటూ గొప్పలు చెప్పుకునే మన సిటీలో ఇంత దరిద్రంగా బస్తీలున్నాయా? అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అన్నిచోట్లా వాటర్‌, డ్రైనేజీ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. రోడ్డుపై పేదలకు కట్టిన టాయ్‌లెట్స్‌ ఆర్భాటంగా ఓపెన్‌ చేస్తారు. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. అధికారుల్ని అడిగితే.. అది అంతే మేడమ్‌. వారికి ఎంత చేసినా అంతేనంటారు. 

పేదలకు క్వార్టర్స్‌ కట్టారు. నాలుగు అంతస్తులు ఉన్నాయి. లిఫ్ట్‌ ఉండదు. ఒకవేళ కడితే.. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయరు. చెత్తవేయడానికి సెపరేట్‌ ప్లేస్‌‌లు ఉన్నాయి. కానీ బస్తీల్లో రోడ్డుపైనే చెత్తనంతా వేస్తారు. విపరీతమైన కంపు... దోమలు.... 200 రూపాయలకు ఓటువేసి.. ప్రజలు కరెప్ట్‌ అయితే.. సమస్యల గురించి అడిగే హక్కు ఉండదు.

మీవంతుగా ఏదైనా చేశారా? 
చాలా చేయాలనుకున్నా.. కానీ ఏమీ చేయలేకపోతున్నా... నాలాంటి వందమంది జయసుధలు వచ్చినా ఏమీ చేయలేం అని తెలుసుకున్నాను. ప్రజల్లో చైతన్యం లేదు. స్వలాభమే చైతన్యం. నాలాలపై ఇళ్లు కడుతుంటారు. దాంతో డ్రైనేజీ పొంగుతుంది. తర్వాత వాళ్ళే వచ్చి.. సమస్యలు వస్తున్నాయ్‌ అని ఎం.ఎల్‌.ఎ.లపై తిరగబడతారు. అది ధర్నా వరకు దారితీస్తుంది. 

ఇదంతా చూసి హ్యూమన్‌ రైట్స్‌ వారు వస్తారు. వారు అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా.. ఒక వేళ తెలిసినా.. ఏదో పోరాటం చేయాలని... ప్రజలకే సపోర్ట్‌ చేస్తారు. ప్రజలు ఏం చేశారు. ఎందుకిలా అయిందని వారికి చెప్పరు. అధికారులు ఎంత చెప్పినా వినరు. మీడియా దీన్ని చిలువలు పలవలు చేస్తుంది. దీంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తాం. తర్వాత మళ్లీ సమస్య మామూలే. నాలాలపై ఇళ్లు కట్టడం మానరు. దాన్ని కూలిస్తే.. అదే పెద్ద నేరం... ముందుగా మనం శుభ్రంగా ఉండాలి. ఇంటి పరిసరాల్ని శుభ్రం చేసుకోవాలి. ఇది ప్రజల్లో లేనంతవరకు ఏమీ చేయలేం.

నిర్మాతగా మారే ఆలోచన ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి? 
నేను నిర్మాతగా మారే ఆలోచన లేదు. మా పెద్దబ్బాయి నిహార్‌కపూర్‌ డిజిటల్‌ టెక్నాలజీ ఆస్ట్రేలియాలో చేశాడు. తను దర్శకుడు అవ్వాలని కోరిక. ఇక రెండోవాడు.. శ్రియన్‌కపూర్‌ మంచి షూటర్‌. నేషనల్‌ లెవల్‌ కాంపిటేషన్‌లో కూడా పాల్గొన్నాడు.. అని ముగించారు.

Sunday, November 6, 2011

శబరిమలైకు 165 బస్సులు



విశాఖపట్నం, శబరిమలై యాత్రికు ల సౌక ర్యార్థం ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్యాకేజీలకు విశేష ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ విశాఖ ప్రాం తీయ అధికారి జగదీష్‌బాబు తెలిపారు. ద్వార కా బస్‌కాంప్లెక్స్‌లో నిర్వహించిన గురుస్వాముల సదస్సులో ఆయన మాట్లాడు తూ ఇప్పటి వరకు విశాఖ రీజియన్‌లో 40 బస్సుల్ని స్వాములు బుక్ చేసుకున్నారన్నారు. ప్రయాణంలో స్వాములు గతంలో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించి స్వాములకు ఎటువంటి ఆటంకం లేకుండా బస్సులు పంపేందు కు ఏర్పాట్లు చేశామన్నారు. 

గత సంవత్సరం 74 బస్సుల్ని శబరిమలైకు పంపగా ఈసారి 165 బస్సుల్ని నడిపేందుకు నిర్ణయించుకున్నామన్నారు. ఈ ఏడాది అన్నీ కొత్త బస్సుల్నే నడుపుతున్నామన్నారు. పంబలోయలో రిలీఫ్ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. తొలుత డిప్యూటీ సీటీఎం వీరయ్య చౌదరి మాట్లాడుతూ సుశిక్షుతులైన డ్రయివర్లను ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో డిప్యూటీ సీడీఎం అప్పలనాయుడు,డిఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 

విద్యుత్ తీగలే మృత్యుపాశాలు




విశాఖపట్నం: అగనంఫూడీ లొ విద్యుత్‌లైన్లు బిగిస్తున్న కార్మికుడికి కుడా విద్యుత్ తీగలే మృత్యుపాశాలయ్యాయి మునగఫాక గ్రామానికి చెందిన భేత రాజు 28 ఆర్‌ఈసీఎస్‌లో సుమారు 10 ఏళ్ల నుంచి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు విధి నిర్వహణలో భాగంగా భేత రాజు  శనివారం ఉదయ్ం కరెంటు స్తంభం ఎక్కి పోల్ ఎక్కి వైర్లు బిగిస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఆయన షాక్‌కు గురై వైర్ల మధ్య చిక్కుకుపోయాడు కిందపడే అవకాశం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఆర్‌ఈసీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అంటూన్నరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం కె జి హె ఛే కు తరలించారు ఆర్‌ఈసీఏస్ అధికారుల ఫిర్యాదు  గాజువాక ఎస్‌ఐ రమన కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
ఇలా ఉండగా  విద్యుత్‌లైన్లు బిగిస్తున్న కార్మికుడికి ఆ విద్యుత్ తీగలే మృత్యుపాశాలయ్యాయి. ఈ దుర్ఘటనపై మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. కశింకోట మండలం చెరకాం గ్రామానికి చెందిన రొంగలి నాయుడుబాబు (40) ఆర్‌ఈసీఎస్‌లో సుమారు 20ఏళ్ల నుంచి కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా నాయుడుబాబు శనివారం సాయంత్రం అనకాపల్లి మండలంలోని ఊడేరు జంక్షన్‌లో కరెంటు స్తంభం ఎక్కి పోల్ ఎక్కి వైర్లు బిగిస్తుండగా హఠాత్తుగా విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఆయన షాక్‌కు గురై వైర్ల మధ్య చిక్కుకుపోయాడు. కిందపడే అవకాశం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్‌ఈసీఏస్ అధికారుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం కోసం తరలించారు. రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా దర్జీనగర్ ప్రాంతంలో పొక్లెయిన్‌తో రోడ్డుపక్కన తుప్పలు తొలగించే పనులు చేస్తున్నారు. అనుకోకుండా పైన ఉన్న ఆర్‌ఈసీఎస్ వైర్లకు పొక్లెయిన్‌కు తగిలి ఆ వైర్లు వాటిపై ఉన్న ట్రాన్స్‌కో వైర్లకు తగిలాయని ఏఈ కోటేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా ఆర్‌ఈసీఎస్ వైర్లకు విద్యుత్ సరఫరా జరిగి, ఊడేరు జంక్షన్‌లో పోల్‌పై పనిచేస్తున్న నాయుడుబాబు విద్యుత్ షాక్‌కు గురయ్యాడని అన్నారు. కాగా ఆర్‌ఈసీఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకు బాధ్యతగా మృతుని కుటుంబానికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గంగుపాం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

Tuesday, November 1, 2011

టీనేజ్ అంటే ఒక తరంగం.


టీనేజ్ అంటే ఒక తరంగం.

టీనేజ్ అంటే ఒక తరంగం... ఒక ఆవేశం... ఒక తొందర పాటు... ఒక ఆకర్షణ.
ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం, ప్రేమలో పడిపోవడం, గాడి తప్పడం, అవసరమైతే తల్లిదండ్రులను కూడా కాదనడం ఈ రోజుల్లో సహజంగా మారింది.

దీనితో నేటి ఆధునిక యువతీ యువకుల్లో అనేక సమస్యలు వస్తున్నాయి. జీవితానికి సంబంధించి అవి చిన్నవైనా కావచ్చు. అయితే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది.
మనం రోజూ ఎందరినో చూస్తుంటాం. ఒక్కొక్కరిదీ ఒక్కో రకం వ్యక్తిత్వం. ఎదుటి వారి మనస్తత్వం బట్టి కొన్ని చోట్ల నడుచుకోవాలి. మనశక్తి సామర్థ్యాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వాతావరణం, అర్హతలనుబట్టి మనుగడ సాగించాలి. జీవనాధారం కోసం ఒక వృత్తిని ఎంచుకోవడం తప్పనిసరి. ఉద్యోగం అంటే నూటికి నూరుపాళ్ళు పక్కాగా వృత్తిపరమైనది. దాన్ని ఎంచుకునే ముందు కడు జాగ్రత్త వహించాలి. జీవితంలో తేడాలు లేకుండా ఒకేసారి నాలుగైదు చోట్ల ఆఫర్లు వస్తుంటాయి. దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురి చేస్తుంది.
అలాంటప్పుడు జాబ్ గుణగణాలు, టైమింగ్స్, వాతావరణం, నివాసానికి, ఆఫీసుకి మధ్య దూరం, రాకపోకలకు అనుకూలత లాంటి అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి, మీ అభిమతానికి, అర్హతకి అనుగుణంగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. పొరపాటున మనకు అనుకూలం కాని జాబ్‌లో చేరిన వెంటనే రిజైన్ చేయకుండా మరో జాబ్‌లో చేరేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే చేస్తున్న మొదటి ఉద్యోగానికి ముగింపు పలకాలి.
యూత్‌లో చాలామంది ఎప్పుడో ఒకసారి ‘‘నేను ప్రేమిస్తున్నాను’’ అనుకుంటారు. నిజంగానే తమ వైపునుంచి ప్రేమలో పడిపోతారు. కానీ ఎదుటివారుకూడా మనల్ని ప్రేమిస్తున్నారా? లేదా అని ఆలోచించరు. మీరు ప్రేమిస్తున్న వారు ‘నో’’ అంటే మీరు తట్టుకోగలగాలి. ఆందోళన చెందకుండా ఉండాలి. ఆ వ్యక్తికి ఎలాంటి వ్యసనాలున్నా భరించగలగాలి. ఆ తర్వాత మార్పు చేసుకోవాలి. అలాంటి గుణం మీరు కలిగినట్టయితే నిజంగా ప్రేమిస్తున్నట్టు లెక్క. సినిమాలు, షికార్లలో మనం ఏం చూస్తే వాటిల్లో సగమైన మనకూ ఉండాలనిపిస్తుంది. కానీ అది అసంభవం కావచ్చు కదా. అప్పుడే మరో ఆలోచన కూడా వస్తుంది. ఒక్కసారిగా బ్రహ్మాండం జరగాలని, అదృష్టం వరించాలని ఇది ఏ నూటికో, కోటికో ఒక్కరికే జరగొచ్చు. అందరికీ కాదుకదా. అందుకే వారానికో ఎంతో కొంత పొదుపు చేసుకుంటూ వెళితే ఐదారు సంవత్సరాలకి పెద్ద మొత్తంగా ఉపయోగించుకోవచ్చు. మనకు ఏమేం కోరికలుంటాయో వాటిని తీర్చుకోవడానికి పొదుపు యంత్రం పాటించాలి.
ఆకలైనా, కాకపోయినా అప్పుడప్పుడు చిళ్ళు తినడం యూత్‌కు అలవాటే. ఐస్‌క్రీమ్‌లు, పానీపూరీలు ... గోబీ... లాంటివి తినడం అంటే సరదా. కానీ నిజంగా ఆకలేస్తుందా అన్నది ఆలోచించుకుంటే వాటి అవసరం ఎంతో తెలుస్తుంది. లేదనుకుంటే మీకు గిఫ్ట్ గ్యారంటీ... అదే ఊబకాయం. రెండు. మూడుసార్లు చిరుతిళ్ల విషయంలో నాలుకను నియంత్రించగలిగితే మరోసారి ఆలోచన రాదు. ఆదిలో ఆ అలవాటును అంతం చేసుకుంటే ఎప్పటికీ మీరు స్లిమ్‌గా యాక్టివ్‌గా ఉండొచ్చు. మీతో అందరూ క్లోజ్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే వారిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేయాలో గమనించాలి. మీకు దగ్గరగా ఉండే వారందరూ ఏ సందర్భంలో సన్నిహితులయ్యారో ఒకసారి మననం చేసుకుంటే తెలుస్తుంది.
మీరు చేసేపనికి తల్లిదండ్రులు లేదా బంధుమిత్రులు అడ్డు చెప్పవచ్చు. అలాంటప్పుడు మీరు చేపట్ట్టే పని గురించి క్షుణంగా చెప్పాలి. మీరు మంచి అవగాహనతోనే వారికి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే మీకు లైన్ క్లియర్, ఇక మీరు ఏ పనైనా... ఛాలెంజ్‌గా ... అవలీలగా చేయొచ్చు. అప్పుడే మీకు మీ వారికి... అందరికీ హ్యాపీ... కష్టే ఫలే ..
- కంచర్ల 

R E C S Anakapalle



Gajuwaka M L A


K M N