బాంబు పేలుళ్ల ను ఖండించిన సీఎం, పలువురు నాయకులు
దిల్సుఖ్నగర్లో వరుస బాంబు పేలుళ్ల సంఘటనా స్థలాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి,కేంద్ర పర్యాటక మంత్రి కె చిరంజీవి ,హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్రెడ్డి, మంత్రి దానం నాగేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, బలాల, హరీష్రావు, మేయర్ మాజిద్హుస్సేన్, బీజేపీ నాయకులు దత్తాత్రేయ, బి. వెంకట్రెడ్డి తదితరులు సందర్శించారు. బాంబు పేలుడు సంఘటననుప్రజాప్రతినిధులు
ముక్తకంఠంతోఖండించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అవసరమైతే కార్పోరేట్ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించామన్నారు. పేలుళ్లలో చనిపోయిన వారికి ఆరులక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ప్రజలు సంయమనం పాటించాలన్న సీఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు.
వరుస బాంబు పేలుళ్లను ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
వరుస బాంబు పేలుళ్లను ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. కుట్రదారులను పట్టుకుని ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది భారత్ పై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా చర్యలుతీసుకోవాలన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.
బాంబు పేలుళ్ల ఘటనను ఖండించిన వెంకయ్యనాయుడు
హైదరాబాద్ లో బాంబు పేలుళ్ల ఘటనను బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రజలు శాంతి యుతంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగంతో పూర్తిగా సహకరించాలని వెంకయ్యనాయుడు కోరారు.
బాంబు పేలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. మీకోసం యాత్రలో పాల్గొంటున్న ఆయన షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చారు. దిల్ సుఖ్ నగర్ కు కార్యకర్తలతోపాటు వచ్చిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. అయితే ఈ ఘటన జరగడానికి ప్రభుత్వ నిర్లక్షమే ప్రధాన కారణమని బాబు అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలన్నారు.
No comments:
Post a Comment