Thursday, March 31, 2011

నూతన్‌ప్రసాద్‌కు టాలీవుడ్ అశ్రునివాళి


నూతన్‌ప్రసాద్‌కు టాలీవుడ్ అశ్రునివాళి
ప్రముఖ సినీ నటుడు నూతనప్రసాద్ బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇంటి నుంచి అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగామృతి చెందారు. ఆయన 1950 అక్టోబర్ 10న కృష్ణాజిల్లా కలిదిండిలో జన్మించారు. నూతనప్రసాద్ అసలు పేరు తాడినాడ వర ప్రసాద్.
అందాలరాముడు సినిమాతో నూతనప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. ‘అస్సలే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’...., చలిచీమలు సినిమాలో‘నూటొక్క జిల్లాలకు అందగాడ్ని’ అనే డైలాగులతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ముత్యాలముగ్గు సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.1989లో ‘బామ్మమాట బంగారుబాట’ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన నూతనప్రసాద్ అప్పటినుంచి వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.1984లో ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డు, 2005లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతనప్రసాద్ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతికి సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు.
నూతన్‌ ప్రసాద్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మా అసోసియేషన్‌ అధ్యక్షుడు, నటుడు మురళీమోహన్‌. కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండాలో... ఆయన్ను చూసి నేర్చుకోవచ్చన్నారు. ప్రసాద్‌తో తనకు నాటక రంగం నుంచే పరిచయం ఉందన్నారు మురళీమోహన్‌. తనకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు మురళీమోహన్‌.

No comments:

Post a Comment