Friday, August 17, 2018

భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి


భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికు ఘన నివాళి
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి (1924-2018) గురువారం సాయంత్రం ఢిల్లీలోని అఖిల భారత
వైద్య విజ్ఞాన సంస్థలో పరమపదించారు. వాజపేయి గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు మరణించినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. వాజపేయి మరణంతో బీజేపీతోపాటు ఇతర పార్టీల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. గత జూన్ నుండి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
 వాజపేయి మరణం పట్ల రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, బీజేపీతోపాటు ఇతర పార్టీల అధినాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. మూడుసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వాజపేయి దాదాపు పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2009లో క్రియాశీల
రాజకీయాల నుండి తప్పుకున్న వాజపేయి లోక్‌సభకు పదిసార్లు, రాజ్యసభకు రెండుసార్లు ఎన్నికయ్యారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015లో వాజపేయిని భారతరత్న అవార్డుతో సత్కరించారు. వాజపేయి మొదటిసారి 1996లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగారు. రెండోసారి 1998లో మరోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టి 11 నెలలు మాత్రమే కొనసాగారు. అయితే 1999లో ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు మాత్రం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగిన మొదటి కాంగ్రెసేతర నాయకుడయ్యారు. తన అద్భుతమైన ప్రసంగాలతో దేశ ప్రజల ప్రేమాభిమానాలను
చూరగొన్న వాజపేయి మంచి కవి. ఆయన రాసిన ఒక గేయంలో ‘వెనకనుండి దాడి చేయకుండా ధైర్యంగా ముందునుండి తనపై దాడి చేయాలి’ అంటూ మృత్యువును ఆహ్వానించటం గమనార్హం. దేశ భక్తికి మారుపేరైన వాజపేయి హిందూత్వాన్ని సమర్థించటంతోపాటు ఇతర మతాల పట్ల కూడా సమభావాన్ని ప్రదర్శించి అందరి గౌరవాభిమానాలు సంపాదించుకున్న మహోన్నత నాయకుడు. 1939లో రాష్ట్రీయ స్వయ సేవక్ సంఘ్‌లో చేరిన
ఆయన ఆఖరు శ్వాస వరకు ఆర్‌ఎస్‌ఎస్ విలువలకు కట్టుబడి ఉన్న ఏకైక నాయకుడు. రెండోసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వెంటనే అణు పరీక్షలు నిర్వహించిన వాజపేయి ఆ వెంటనే పాకిస్తాన్‌తో సంబంధాలు
పెంచుకునేందుకు అత్యున్నత స్థాయిలో కృషి చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన ఆఫీస్‌కు పార్థివ దేహాన్ని తరలిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో

అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు. మరోవైపు మాజీ పీఎం వాజ్‌పేయి మరణంతో 20 రాష్ర్ట ప్రభుత్వాలు, ఆఫీసులకు, స్కూల్, కాలేజీలకు సెలవులు ప్రకటించడం గమనార్హం.








No comments:

Post a Comment