మన దేశంలో మనసుతో సంబంధం లేకుండా శరీరానికి మాత్రమే వైద్యం చేసేవారు ఎక్కువగా ఉన్నారని ఈ పరిస్థితిని యువ వైద్యులే మార్చాలని భారత మాజీ రాష్టప్రతి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్య పరిశోధనకు సంబంధించి ఏర్పాటు చేసిన ఓస్మికాన్ సమావేశంలో కలాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్లో ఫైవ్స్టార్, త్రీ స్టార్ ఆస్పత్రులు అంతకుమించి హంగులు ఉన్నా, మనసుతో వైద్యం చేసే డాక్టర్లు అరుదుగా ఉన్నారని అన్నారు. రోగి మానసిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి రోగికి అవసరమున్నా లేకున్నా కనీసం 15 రోగ నిర్ధారణ పరీక్షలు చేయించేందుకు వైద్యులు సిద్ధపడుతున్నారని తప్పుపట్టారు. వైద్య విద్యార్ధులు అంతా కలిసి ఈ లోపభూయిష్టమైన విధానాన్ని అడ్డుకోవాలని సూచించారు. అణ్వాయుధ దేశంగా భారత్ గుర్తింపు పొందిన సమయం కన్నా ఆర్ధోపెడిక్ వైద్యంలో వినియోగించే కాలిపర్స్ తయారీకి తన వంతు సాయం అందజేయడం, గుండె వైద్యంలో వినియోగించే రాజు-కలాం స్టెంట్ తయారీ వంటి అంశాలు తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైద్య విద్య సంచాలకుడు శాంతారావు, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పుట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థికి ఉత్తమ వ్యక్తిత్వం అవసరం
ఉత్తమ వ్యక్తిగా ఎదగాలంటే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకో
No comments:
Post a Comment